న్యూఢిల్లీ: హాకీ, క్రికెట్ తర్వాత ఇప్పుడు కరోనా సెగ భారత రెజ్లింగ్నూ తాకింది. స్టార్ రెజ్లర్, ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్ రజత పతక విజేత దీపక్ పూనియా కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. పునియాతో పాటు మరో ఇద్దరు రెజ్లర్లు నవిన్ (65 కేజీల విభాగం), కృషన్ కుమార్ (125 కేజీల విభాగం)లకు కూడా కరోనా సోకిందని తెలిసింది.
హరియాణాలోని సోనేపట్ వేదికగా ఈ నెలలో పురుషుల జాతీయ శిక్షణ శిబిరం మొదలవ్వాల్సి ఉంది. దీనికి ఎంపికైన రెజ్లర్లు సెప్టెంబర్ 1న అక్కడి సాయ్ సెంటర్లో రిపోర్ట్ చేశారు. ప్రొటోకాల్ ప్రకారం వారికి ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించగా.. దీపక్, నవీన్, కృషన్లు కరోనా పాజిటివ్గా తేలారు. వీరిని ముందు జాగ్రత్త చర్యగా ఆసుపత్రికి తరలించినట్లు సాయ్ చెప్పింది. ఈ ముగ్గురికి రెండు రోజుల్లో మరోసారి పరీక్షలు జరుపుతామని నెగెటివ్ వస్తే శిబిరానికి తిరిగి తీసుకొస్తామని అధికారులు వెల్లడించారు.
'ముగ్గురు సీనియర్ రెజ్లర్లకు కరోనా ఉన్నట్లు తేలింది. వెంటనే వారిని సాయ్ హాస్పిటల్లో చేర్పించాం. రెండు రోజుల తర్వాత వీరికి మరోసారి కరోనా పరీక్షలు నిర్వహిస్తాం. నెగెటివ్ అని తేలితే.. వారిని తిరిగి క్యాంపుకు తీసుకొస్తాం' అని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) సహాయ కార్యదర్శి వినోద్ తోమర్ పేర్కొన్నారు. రెజ్లర్లకు కరోనా ఉన్నట్లు తేలినంత మాత్రాన క్యాంపు రద్దయ్యే అవకాశం లేదని అతడు స్పష్టం చేశారు.
రెజ్లర్ల ముగ్గురి ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని, 14 రోజుల క్వారంటైన్ ముగిసిన వెంటనే శిక్షణ శిబిరం ఆరంభం అవుతుందని వినోద్ తోమర్ తెలిపారు. 86 కేజీల విభాగంలో పోటీపడే పునియా.. ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్ బెర్తు సంపాదించాడు. టోక్యో ఒలింపిక్స్లో ఆడే అవకాశాన్ని సొంతం చేసుకున్న మరో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్కు ఇటీవలే కరోనా వచ్చి తగ్గిన సంగతి తెలిసిందే.
US Open: గార్సియా సంచలన విజయం.. ప్లిస్కోవాకు షాక్!!