నలుగురు ఫామ్లో లేరు
తాజాగా వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ... 'సురేశ్ రైనా, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ వంటి క్రికెటర్లు అంతర్జాతీయ లేదా పోటీ క్రికెట్ గతకొంత కాలంగా ఆడటం లేదు. గాయం కారణంగా కొన్నాళ్లుగా రవీంద్ర జడేజా టీమిండియాకు దూరమయ్యాడు. అంటే ఏడుగురు అత్యుత్తమ ఆటగాళ్లలో నలుగురు ఫామ్లో లేరు లేదా పోటీ క్రికెట్ ఆడలేదు. ఇదే చెన్నై జట్టు ప్రధాన లోపం' అని అన్నారు. ఏప్రిల్ 10న ఢిల్లీ క్యాపిటల్స్తో చెన్నై సూపర్ కింగ్స్ తొలి మ్యాచులో తలపడనుంది. గతేడాది పేలవ ఆటతీరుతో సెమీస్ చేరని విషయం తెలిసిందే. పట్టికలో 7వ స్థానంలో నిలిచింది.
నలుగురి సంగతేంటి
'రాబిన్ ఉతప్ప, రుతురాజ్ గైక్వాడ్ రాణించేందుకు అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వారు దేశవాళీ క్రికెట్ ఆడారు. మంచి గణాంకాలు సాధించారు. ఫాఫ్ డుప్లెసిస్ సైతం ఫామ్లోనే ఉన్నాడు. కానీ మిగిలిన నలుగురి సంగతేంటి?. భారీ షాట్లు ఆడటం, పరుగెత్తడం వారికి సవాల్గా మారతాయి. బ్యాటింగ్ ఆర్డర్లో జడేజాను ముందు పంపించాలని సీఎస్కేకు నా సూచన. ధోనీ కూడా ముందుకు రావాలి. ఏదేమైనప్పటికీ రైనా కీలకమవుతాడు. అతడు ఫామ్లో ఉండి పరుగులు చేస్తే జట్టుకు మేలు. లేదంటే కష్టమే. సీజన్ మొత్తం ఇబ్బంది పడుతుంది' అని చోప్రా పేర్కొన్నారు.
5 మ్యాచ్లు ముంబై వేదికగా
ఐపీఎల్ 2021 మ్యాచులకు ముంబై, కోల్కతా, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్ మ్యాచ్లకి ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. ఈసారి ఏ జట్టుకూ సొంతగడ్డపై ఆడే అవకాశం లేదు. సీఎస్కే లీగ్ దశలో 14 మ్యాచ్లు ఆడనుండగా.. అందులో 5 మ్యాచ్లు ముంబై వేదికగా, 4 మ్యాచ్లు ఢిల్లీ వేదికగా, 3 మ్యాచ్లు బెంగళూరు వేదికగా, 2 మ్యాచ్లు కోల్కత వేదికగా ఆడనుంది. ఐపీఎల్ 2020 సీజన్కు గాను సీఎస్కే ప్రదర్శన చూసుకుంటే.. మొత్తం 14 మ్యాచ్ల్లో 6 విజయాలు, 8 ఓటములను ఎదుర్కొంది.
ఆరుగురిని రిలీజ్ చేసిన చెన్నై
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా ఉన్న సీఎస్కే 2021 మినీ వేలానికి ముందు ఆరుగురిని రిలీజ్ చేసింది. వారిలో కేదార్ జాదవ్, పియుష్ చావ్లా, మురళి విజయ్, మోను కుమార్, హర్భజన్ సింగ్, షేన్ వాట్సన్ ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 18న జరిగిన వేలంలో సీఎస్కే రూ. 17.35 కోట్లు ఖర్చు చేసింది. సీఎస్కే కోనుగోలు చేసిన వారిలో ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ మొయిన్ అలీతో పాటు టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా ఉన్నాడు.