IPL 2021: 'ఫ్రాంచైజీలకు నమ్మకద్రోహం చేస్తున్నారు.. మిమ్మల్ని ఐపీఎల్ ఫ్యామిలీ ఎప్పటికీ మర్చిపోలేదు'

ముంబై: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 మలిదశ మ్యాచ్లు యూఏఈ వేదికగా ఈ నెల 19న ఆరంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ 2021 మిగతా మ్యాచులకు తాము అందుబాటులో ఉండమని ఇంగ్లండ్ క్రికెటర్లు డేవిడ్ మలాన్ (పంజాబ్ కింగ్స్), క్రిస్ వోక్స్ (ఢిల్లీ క్యాపిటల్స్), జానీ బెయిర్స్టో (సన్రైజర్స్) తమతమ ఫ్రాంఛైజీలకు భారీ షాక్ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, స్టార్ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఆ ముగ్గురిపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. వాళ్లు చేసిన పనిని ఐపీఎల్ ఫ్యామిలీ ఎప్పటికీ మరచిపోదని, భవిష్యత్తులో వాళ్లు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నాడు.

ఇంగ్లండ్ ఆటగాళ్లు దూరం
ఇదివరకే పలువురు ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు వివిధ కారణాల చేత ఐపీఎల్ 2021 నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్ జట్టు కీలక ప్లేయర్స్ జోస్ బట్లర్, జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ ఐపీఎల్కు అందుబాటులో ఉండమని ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో బట్లర్.. మానసిక ఆరోగ్య సమస్యలతో స్టోక్స్.. గాయం కారణంగా ఆర్చర్ తపుకున్నారు.
తాజాగా డేవిడ్ మలాన్, క్రిస్ వోక్స్, జానీ బెయిర్స్టో కూడా రావడం లేదని చెప్పారు. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు సామ్ కరన్, మొయిన్ అలీలు సైతం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కొత్త గైడ్లైన్స్ కారణంగా ప్లేఆఫ్స్కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ లెక్కన ఎనిమిది మంది ఇంగ్లండ్ ఆటగాళ్లు ఐపీఎల్ మలిదశ ఐపీఎల్కు అందుబాటులో ఉండటం లేదు.

ఐపీఎల్ ఫ్యామిలీ ఎప్పటికీ మర్చిపోలేదు
తన యూట్యూబ్ ఛానెల్లో షేర్ చేసిన ఓ వీడియోలో స్టార్ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ... 'జోస్ బట్లర్, జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ ఇప్పటికే ఐపీఎల్ 2021కు దూరమయ్యారు. తాజాగా డేవిడ్ మలాన్, క్రిస్ వోక్స్, జానీ బెయిర్స్టో కూడా రావడం లేదని చెప్పారు. ఆ లెక్కన అర డజను మంది ఇంగ్లండ్ ప్లేయర్స్ ఐపీఎల్ 2021 రెండో దశలో ఆడటం లేదు.
ఇది సామూహికంగా టోర్నీ ఎగ్గొట్టడమే అవుతుంది. ఐపీఎల్ కుటుంబం ఎప్పటికీ దీనిని మరచిపోదు' అని అన్నాడు. ఓ ఫ్రాంచైజీ నుంచి తప్పుకోవడం అంటే ఆ ప్లేయర్ తమను మోసం చేశాడని, నమ్మక ద్రోహం చేశాడని ఫ్రాంచైజీలు భావిస్తాయని ఇంగ్లండ్ ప్లేయర్స్ గుర్తు పెట్టుకోవాలని ఆకాశ్ చోప్రా అన్నాడు.

భవిష్యత్తులో కష్టమే
వాస్తవానికి ఇది కఠినమైన సమయం అని, కానీ టీం కోసం ముందుకువెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంటుందని ఇలా ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. సడెన్గా ప్లేయర్స్ తప్పుకోవడం ఫ్రాంచైజీలను తీవ్ర అసంతృప్తికి గురి చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డాడు. ఓ ప్లేయర్ ఎంతో ముఖ్యమనుకొని ఫ్రాంచైజీలు వ్యూహరచన చేస్తాయని, ఆ ప్లేయర్ సడెన్గా తప్పుకుంటే సదరు ప్లేయర్ను భవిష్యత్తులో ఆయా ఫ్రాంచైజీలు తీసుకునే అవకాశమే ఉండదని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. ఇలా మధ్యలోనే తప్పుకోవడంతో ఇప్పటికే కొందరు ప్లేయర్స్ మూల్యం చెల్లించుకున్నారని ఆకాష్ ఉదహరించాడు.

సెప్టెంబర్ 19న ఆరంభం
ఐపీఎల్ 2021 సీజన్ వాయిదాపడే సమయానికి 29 మ్యాచ్లు ముగిసాయి. మిగతా మ్యాచులు సెప్టెంబర్ 19న ఆరంభం కానున్నాయి. సెప్టెంబరు 19న చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగే పోరుతో ఐపీఎల్ 2021 రెండో దశ మొదలవుతుంది. ఐపీఎల్ 2021 సీజన్ వాయిదాపడే సమయానికి 7 మ్యాచ్లాడిన చెన్నై.. ఐదింట్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ (12 పాయింట్లు) ఆరు విజయాలతో ఉండగా.. మూడో స్థానంలో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు (10 పాయింట్లు), నాలుగులో ముంబై ఇండియన్స్ (8 పాయింట్లు) ఉన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
IND vs ENG: బీసీసీఐ బాధ్యతారహితమైన బోర్డు కాదు.. అందుకే ఐదో టెస్టును రద్దు చేశాం! ఇక సిరీస్ ముగిసింది: గంగూలీ