
బీసీసీఐ బాధ్యతారహితమైన బోర్డు కాదు:
ఐదో టెస్ట్ రద్దవడంపై ఇంగ్లండ్ మీడియా టీమిండియాపై నానా నిందలూ వేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించాడు. ద టెలిగ్రాఫ్తో మాట్లాడిన దాదా .. ఐదవ టెస్ట్ ఆడడానికి టీమిండియా ప్లేయర్స్ సుముఖంగా లేని విషయం నిజమేనన్నాడు. ఐదవ టెస్టును రద్దు చేయడంలో ఐపీఎల్ 2021 పాత్ర ఉందా? అని అడిగినప్పుడు.. 'లేదు.. లేదు. ఆ వార్తలో ఏ మాత్రం నిజం లేదు. బీసీసీఐ బాధ్యతారహితమైన బోర్డు కాదు. ఇతర బోర్డులను ఎప్పుడూ గౌరవిస్తుంది. ఎవరికీ నష్టం వాటిల్లే విధంగా బీసీసీఐ వ్యవహరించదు. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఒక్కోసారి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్లేయర్స్ ఆరోగ్యమే ముఖ్యం' అని గంగూలీ అన్నాడు.

కరోనా సోకుతుందని భయపడ్డారు:
'ఐదో టెస్ట్ మ్యాచ్ ఆడడానికి ప్లేయర్స్ నిరాకరించారు. కానీ వాళ్లను కూడా ఈ విషయంలో అసలు నిందించలేం. ఫిజియో యోగేశ్ పార్మర్ అప్పటికే ప్లేయర్స్తో టచ్లో ఉన్నాడు. నితిన్ పటేల్ కూడా ఐసోలేషన్లోకి వెళ్లిన తర్వాత యోగేశ్ ఒక్కడే సహాయ బృందంలో మిగిలిపోయాడు. యోగేశ్ ప్రతి రోజూ ఆటగాళ్లకు మసాజ్ చేసేవాడు. అతనికి కరోనా సోకిందని తెలియగానే.. ప్లేయర్స్ అందరూ ఆందోళనకు గురయ్యారు. తమకూ కరోనా సోకుతుందని భయపడ్డారు' అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వెల్లడించాడు. బబుల్లో ఉండటం అంత తేలికైన విషయం కాదని కూడా ఈ సందర్భంగా దాదా పేర్కొన్నాడు. భారత ఆటగాళ్లు గత కొన్ని నెలలుగా తీరికలేని క్రికెట్ ఆడుతున్నారు, ప్లేయర్స్ ఫీలింగ్స్ను కూడా మనం అర్థం చేసుకోవాలన్నాడు.

టెస్ట్ సిరీస్ ఇక ముగిసిపోయింది:
'ఐదవ టెస్ట్ మ్యాచ్ వల్ల ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నష్టపోయిన విషయం తెలుసు. కానీ ముందు ఈ గందరగోళం తొలగిపోతే తర్వాత ఓ నిర్ణయం తీసుకోవచ్చు. ఈ టెస్ట్ సిరీస్ ఇక ముగిసిపోయింది. వచ్చే ఏడాది ఎప్పుడు ఆ టెస్ట్ ఆడినా.. అది ఏకైక మ్యాచ్ సిరీస్ అవుతుంది. ఈ నెల 22న నేను లండన్ వెళ్తున్నాను. మ్యాచ్లను వాయిదా వేయడం అంత సులువు కాదు. భవిష్యత్తులో మళ్లీ ఇలా జరగదు' అని సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. దాదా మాటలను బట్టి చూస్తే.. టెస్ట్ సిరీస్ 2-1తో భారత్ సొంతమయినట్టే. దాంతో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ గడ్డలపై కోహ్లీసేన చరిత్ర సృష్టించినట్టే.

22న లండన్కు దాదా:
ఐదో టెస్ట్ మ్యాచ్ రద్దవడంతో ఈసీబీకి సుమారు రూ.200 కోట్లు నష్టం రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాంతో భవిష్యత్లో ఈ మ్యాచ్ తిరిగి నిర్వహించడానికి బీసీసీఐ ఆసక్తి చూపుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది పరిమిత ఓవర్ల సిరీస్ కోసం టీమిండియా మళ్లీ ఇంగ్లండ్కు వెళ్ళినపుడు.. రద్దైన ఐదో టెస్టుకు బదులుగా రెండు టీ20లు షెడ్యూల్లో చేర్చాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ఇదే విషయాన్ని ఈసీబీకి కూడా చెప్పినట్టు సమాచారం తెలుస్తోంది. ఈ వ్యవహారంపైనే దాదా ఈ నెల 22న నేను లండన్ వెళ్తున్నాడు.


Click it and Unblock the Notifications












