అభిమాని సర్ప్రైజ్:
భారత క్రికెటర్లు ఆస్ట్రేలియా పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. కఠోర సాధన చేస్తూనే కాస్త సమయం దొరికినప్పుడు కంగారూల గడ్డను చుట్టేస్తున్నారు. అయితే కొత్త ఏడాది సందర్భంగా టీమిండియా క్రికెటర్లు ఐదుగురు మెల్బోర్న్లోని ఓ హోటల్కు వెళ్లారు. భోజనాలు చేసిన తర్వాత వాళ్లు బిల్లు అడిగితే.. అప్పటికే దాన్ని చెల్లించారని హోటల్ సిబ్బంది తెలిపారు. మీ టేబుల్ వెనుక కూర్చున్న నవల్దీప్ సింగ్ అనే వ్యక్తి బిల్లును కట్టేశారని పేర్కొన్నారు. దీంతో మన క్రికెటర్లు సర్ప్రైజ్ అయ్యారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో, బిల్లు ఫొటో నెట్టింట్లో వైరల్గా మారాయి.
ఐసోలేషన్లోకి ఐదుగురు:
అయితే రిషబ్ పంత్ సదరు అభిమానిని హగ్ చేసుకున్నాడన్న వార్తలు కూడా వచ్చాయి. విషయం తెలుసుకున్న బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా అప్రమత్తమయ్యాయి. ముందు జాగ్రత్త చర్యగా ఐదుగురు ఇండియన్ క్రికెటర్లను ఐసోలేషన్లోకి పంపించాయి. ఇక నుంచి రోహిత్ శర్మతో పాటు శుభమన్ గిల్, పృథ్వి షా, నవ్దీప్సైనీ, రిషబ్ పంత్లు మిగతా టీమ్తో విడిగా ఉంటారు. ఇకపై వీరందరూ మిగతా టీమ్స్తో ప్రయాణించడంగానీ, ప్రాక్టీస్ చేయడం కానీ కుదరదు. జనవరి 7న సిడ్నీలో మూడో టెస్ట్ ఆరంభం కానుంది. ఇంకా 4-5 రోజుల సమయం ఉంది కాబట్టి అప్పటివరకు వీరి ఐసోలేషన్ పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ లోపు మూడుసార్లు కరోనా టెస్టులు కూడా చేస్తారు. ఒకవేళ ఎవరికైనా పాజిటివ్ వస్తే సిడ్నీ టెస్టులో ఆడరు.
అభిమాని యూ టర్న్:
బయో-సెక్యూర్ నిబంధనల్ని అతిక్రమించిన రిషబ్ పంత్పై టీమిండియా మేనేజ్మెంట్ చర్యలు తీసుకోబోతున్నట్లు వార్తలు రావడంతో.. భారత అభిమాని నవల్దీప్ సింగ్ యూ టర్న్ తీసుకున్నాడు. తనకి పంత్ హగ్ ఇవ్వలేదంటూ వివరణ ఇచ్చాడు. పంత్ తనని హగ్ చేసుకోలేదని.. రెస్టారెంట్లో సామాజిక దూరం పాటించామని చెప్పడంతో పాటు ఏదో అత్యుత్సాహంలో అలా చెప్పేశానని పేర్కొన్నాడు. అయినప్పటికీ టీమిండియా మేనేజ్మెంట్ ఆ విషయంపై విచారణ జరిపే అవకాశం ఉంది.
బీసీసీఐ ఫైర్:
ఇండియన్ క్రికెటర్లు కొవిడ్-19 ప్రొటోకాల్ను ఉల్లంఘించారని, దీనిపై బీసీసీఐ విచారణ జరుపుతోందన్న ఆస్ట్రేలియన్ మీడియా వార్తలను ఇండియన్ క్రికెట్ బోర్డు ఖండించింది. అక్కడి మీడియాలోని ఓ వర్గం కావాలనే ద్వేషపూరిత వార్తలను ప్రచురిస్తోందని బోర్డు మండిపడింది. రెండో టెస్ట్లో వాళ్ల టీమ్ ఓడిపోయిన తర్వాత అక్కడి మీడియాలో ఇలాంటి వార్తలను ప్రచురిస్తోందని విమర్శించింది. టీమ్లోని ప్లేయర్స్ అందరికీ కొవిడ్ ప్రోటోకాల్స్ గురించి తెలుసని బోర్డులోని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.
సౌరవ్ గంగూలీకి మూడు స్టెంట్లు.. మరో 48 గంటలు ఆసుపత్రిలోనే!!