ఫస్ట్ డౌన్లో పడిక్కల్
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్ మంచి ఆరంభాన్నే అందించారు. తొలి వికెట్కు 49 రన్స్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే రుతురాజ్ ఔటైన వెంటనే దేవదత్ పడిక్కల్ను పంపించి టీమ్మేనేజ్మెంట్ ఘోర తప్పిదం చేసింది. అప్పటికే క్రీజులో లెఫ్టాండ్ బ్యాట్స్మన్ శిఖర్ ధావన్ ఉండటం.. పడిక్కల్ కూడా ఎడమచేతివాటం ఆటగాడే కావడంతో శ్రీలంక కెప్టెన్ ఆఫ్ స్పిన్నర్లతో బౌలింగ్ చేయించాడు. దాంతో ఈ జోడీ పరుగులు చేయడానికి తెగ ఇబ్బంది పడింది. 28 బంతుల పాటు ఒక్క బౌండరీ బాదలేకపోయింది. పడిక్కల్ సైతం భారీ షాట్లు ఆడకపోవడంతో ధావన్పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ క్రమంలోనే స్కోర్ను పెంచే ప్రయత్నంలో ధావన్ పెవిలియన్ చేరాడు. పడిక్కల్కు బందులు సంజూ శాంసన్ను పంపించి ఉంటే రైట్-లెఫ్ట్ కాంబినేషన్తో శ్రీలంక బౌలర్లపై ఎదురు దాడి చేసే అవకాశం ఉండేది. సంజూ బౌండరీలు బాదితే ధావన్ చివరి వరకు క్రీజులో ఉండే ప్రయత్నం చేసేవాడు. అప్పుడు మెరుగైన స్కోర్ లభించేది.
బ్యాట్స్మన్ కొరత
కరోనా కారణంగా ఏకంగా 9 మంది ఆటగాళ్లు దూరమవ్వడంతో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ బలహీనమైంది. కేవలం ఐదుగురు బ్యాట్స్మెన్తోనే బరిలోకి దిగాల్సి వచ్చింది. ముఖ్యంగా చివర్లో హార్దిక్ పాండ్యాలా హిట్టింగ్ చేసే బ్యాట్స్మన్ లేకపోవడం భారత్కు నష్టం చేసింది. చివరి ఓవర్లలో ధాటిగా ఆడే బ్యాట్స్మెన్ లేక సింగిల్స్కే పరిమితం కావాల్సి వచ్చింది. ఆఖరి ఓవర్లో నాలుగు పరుగులే వచ్చాయంటే బ్యాటింగ్ బలహీనతను అర్థం చేసుకోవచ్చు. ఆ ఓవర్లో కనీసం 10 పరుగులు చేసినా ఫలితం మరోలా ఉండేది. పిచ్పై లభించిన సహకారంతో లంక బౌలర్లు చెలరేగడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 132 రన్స్ మాత్రమే చేయగలిగింది.
చెత్త ఫీల్డింగ్
133 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక సైతం తడబడింది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. కానీ భారత పేలవ ఫీల్డింగ్ ఆ జట్టుకు కలిసొచ్చింది. ఓవరాల్గా భారత ఫీల్డర్లు రెండు క్యాచ్లు జారవిడచడంతో పాటు చాలా పరుగులను ఆపలేకపోయారు. రాహుల్ స్టన్నింగ్ క్యాచ్ మినహా భారత ఫీల్డింగ్ పరమ చెత్తగా సాగింది. వికెట్ కీపర్ సంజూ శాంసన్ ఓ క్యాచ్ విడిచిపెట్టగా.. భువనేశ్వర్ కుమార్ మరో సునాయస క్యాచ్ను నేలపాలు చేశాడు. కుల్దీప్ వేసిన 14 ఓవర్ రెండో బంతికి ధనుంజయ లాంగాఫ్ దిశగా ఆడగా.. సకారియా మిస్ ఫీల్డ్ చేసి బౌండరీ ఇచ్చాడు. ఈ బౌండరీతో కాన్ఫిడెన్స్ పెంచుకున్న ధనుంజయ బంతి వ్యవధిలోనే భారీ సిక్సర్ బాదాడు. సకారియా మిస్ ఫీల్డే అతన్ని క్రీజులో కుదురుకునేలా చేసింది. ఆ బౌండరీ కనుక ఆపి ఉంటే.. కుల్దీప్ మరింత పకడ్బందీగా బౌలింగ్ చేసేవాడు. ధనుంజయ భారీ షాట్ ఆడే ప్రయత్నంలో ఔటయ్యేవాడు.
ధావన్ అనాలోచిత నిర్ణయాలు..
ఆరుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో బరిలోకి దిగిన ధావన్ వారి సేవలను పూర్తిగా వాడుకోలేకపోయాడు. స్పిన్నర్లతోనే ఎక్కువ బౌలింగ్ చేయించిన ధావన్.. నవ్దీప్ సైనీకి ఒక్క ఓవర్ కూడా ఇవ్వలేదు. అతనికి కొత్త బంతితో పవర్ప్లేలో ఓవర్ ఇచ్చి మధ్యలో మరొక ఓవర్ ఇచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. చివర్లో కొరకరానికొయ్యగా మారిన ధనుంజయను కట్టడి చేయడానికి స్పిన్నర్లను వాడుకునే అవకాశం ఉండేది. ధావన్ అనాలోచిత నిర్ణయాలు.. ఫీల్డ్ ప్లేస్మెంట్స్ సరిగ్గా లేకపోవడం కూడా భారత్ ఓటమికి కారణమైంది. 19వ ఓవర్ సకారియాతో వేయించి.. చివరి ఓవర్ భువనేశ్వర్తో వేసినా ఫలితం వేరేలా ఉండేది. 19వ ఓవర్లో సకారియా 10 పరుగులిచ్చినా.. చివరి ఓవర్లో భువీ 10 రన్స్ను డిఫెండ్ చేసేవాడు.