గ్రాండ్ మదర్ మరణంతో..
మనిషి జీవితంలో ఆత్మీయతకు, అనురాగానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. మన ఆత్మీయులను కోల్పోయినప్పుడు మనలోని భావోద్వేగాన్ని కొన్నిసార్లు ఆపుకోలేం. బయటికి బాగానే కనిపిస్తున్న ఎక్కడో గుండె లోపల ఆ బాధ అలానే ఉంటుంది. ఎవరైనా కదిలిస్తే ఆ బాధ హృదయ ద్వారాలను బద్దలుకొట్టుకుని బయటకు వచ్చేస్తుంది. సరిగ్గా ఆస్ట్రేలియా బౌలర్ ఆండ్రూ టై విషయంలోనూ అదే జరిగింది. 2018 సీజన్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరఫున ఆడిన టై(4/34).. రాజస్థాన్తో జరిగిన ఓ మ్యాచ్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు.
ఈ ఇన్నింగ్స్ అనంతరం పర్పుల్ క్యాప్ అందుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు. చెమర్చిన కళ్లతో ‘ఈ రోజు నా గ్రాండ్మదర్ చనిపోయారు. నేటి ప్రదర్శనను ఆమెకు, నా కుంటుంబానికి అంకితం ఇస్తున్నాను. ఇది నాకు ఎమోషనల్ మ్యాచ్. నా జీవితంలో చాలా కఠినమైన రోజు ఇది. నేనెప్పుడూ క్రికెట్ ఆడటాన్నిఆస్వాదిస్తాను'అని టై చెప్పాడు. ఈ మ్యాచ్లో వికెట్ తీసినప్పుడల్లా మోచేతి పై భాగాన ఉన్న ‘గ్రాండ్ మా'అనే బ్యాండ్ను టై ముద్దాడాడు.
దు:ఖాన్ని ఆపుకోలేకపోయిన కుల్దీప్
కోల్కతానైట్రైడర్స్ ప్లేయర్ అయిన కుల్దీప్ 2019 సీజన్లో కన్నీటి పర్యంతమయ్యాడు. ఈడెన్ గార్డెన్ వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన లీగ్ మ్యాచ్లో కుల్దీప్ ఊచకోతకు గురయ్యాడు. అతను వేసిన 16వ ఓవర్లో ఆర్సీబీ బ్యాట్స్మన్ మోయిన్ అలీ విధ్వంసం సృష్టించాడు. మూడు సిక్స్లు, 2 ఫోర్లతో మొత్తం 27 పరుగులు పిండుకున్నాడు. ఈ ఊచకోతతో కుల్దీప్ ఆ మ్యాచ్ను (1/59)తో ముగించాడు. ఇది అతని ఐపీఎల్ కెరీర్లోనే అత్యంత చెత్త ప్రదర్శన. అయితే ఆ ఓవర్ వేసిన అనంతరం కుల్దీప్ బావోద్వేగానికి లోనయ్యాడు. ఉబికి వస్తున్న దు:ఖాన్ని ఆపుకోలేక కన్నీటి పర్యంతమయ్యాడు. నితీష్ రాణా ఓదార్చినా.. వాటర్ తాగుతూ.. కవర్ చేసే ప్రయత్నం చేసినా.. అతని కన్నీళ్లు టీవీ కెమెరాలకు చిక్కాయి. అప్పట్లో దీనికి సంబంధించిన ఫొటో, వీడియో నెట్టింట హల్చల్ చేశాయి.
చెంప చెళ్లు మనిపించిన భజ్జీ..
ఐపీఎల్ తొలి సీజన్లో భారత సీనియర్ క్రికెటర్లు హర్బజన్ సింగ్, శ్రీశాంత్ మధ్య చోటు చేసుకున్న గొడవ గురించి తెలియని క్రికెట్ అభిమాని ఉండడు. ముంబై ఇండియన్స్-కింగ్స్ లెవన్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్లో ఈ వివాదస్పద ఘటన చోటుచేసుకుంది. భజ్జీ ముంబైకీ ఆడగా.. శ్రీశాంత్ పంజాబ్కు ప్రాతినిథ్యం వహించాడు.
మ్యాచ్ ముగిశాక అసలేం జరిగిందో స్పష్టత లేదు కానీ భజ్జీ మాత్రం శ్రీశాంత్ను చెంపదెబ్బ కొట్టాడు. దీంతో కెమెరాల్లో శ్రీ ఏడుస్తూ కన్పించాడు. అప్పట్లో ఇది సంచలనమైంది. దీనిపై ఐపీఎల్ యాజమాన్యం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. భజ్జీని మిగతా టోర్నీ మొత్తానికి బ్యాన్ చేసింది. అయితే తన పరిస్థితి చేయి దాటడంతోనే తాను శ్రీశాంత్ను కొట్టానని భజ్జీ తర్వాత వివరణ ఇచ్చుకున్నాడు. అప్పట్లో తనకు విధించిన శిక్ష సరైనదే అని కూడా అంగీకరించాడు.
ఈ ఘటన జరిగిన దశాబ్ధం తర్వాత శ్రీశాంత్ ఈ ఘటనపై స్పందిస్తూ.. హర్భజన్ తనను చెంప దెబ్బకొట్టలేదన్నాడు. కానీ అతని చేతితో వెనుకభాగంలో కొట్టే ప్రయత్నం చేశాడన్నాడు. ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో అలా ప్రవర్తించాల్సి వచ్చిందన్నాడు.
టైటిల్ చేజారి.. కన్నీళ్లు వచ్చిన వేళ..
ఐపీఎల్ 2016 ఫైనల్ అనంతరం అప్పటి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్మన్ సచిన్ బేబీ కన్నీటి పర్యంతమయ్యాడు. సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన నాటి ఫైనల్ మ్యాచ్లో బెంగళూరు ఓటమిపాలై తృటిలో టైటిల్ చేజార్చుకుంది. ఆఖరి ఓవర్లో బెంగళూరు విజయానికి 18 పరుగులు చేయాల్సి ఉండగా.. స్టువర్ట్ బిన్నీ, సచిన్ బేబీ క్రీజులో ఉన్నారు. ఇక హైదరాబాద్ స్టార్ పేసర్ భువనేశ్వర్ అద్భుత బౌలింగ్తో తొలి బంతుల్లో 4 పరుగులే ఇచ్చాడు. చివరి రెండు బంతుల్లో 14 పరుగులు చేయాల్సి ఉండగా.. నాన్స్ట్రైక్ ఎండ్ చేరిన సచిన్ బేబీ కూలబడిపోయాడు.
ఆద్యాంతం ఉత్కంఠగా సాగిన ఆ మ్యాచ్లో ఓటమిని తట్టుకోలేక కన్నీటి పర్యంతమయ్యాడు. దీనికి సంబంధించిన ఫొటో నెట్టింట హల్చల్ చేసింది. ఆ సీజన్ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబర్చి గ్రూప్ టాపర్గా నిలిచిన ఆర్సీబీ.. ఫైనల్లో ఓడుతుందని ఎవరూ ఊహించలేదు. విరాట్ కోహ్లీ వరస సెంచరీలతో సూపర్ ఫామ్.. గేల్, డివిలియర్స్ విధ్వంసకర ఇన్నింగ్స్తో ఆర్సీబీ తిరుగులేని శక్తిగా దూసుకెళ్లింది. కానీ కేవలం బౌలింగ్ అస్త్రాన్నే నమ్ముకొని ఫైనల్ చేరిన హైదరాబాద్ చేతిలో ఖంగుతిన్నది.
సీఎస్కే.. నన్ను కాదని ధోనీని ఎంచుకున్నప్పుడు గుండెలో గునుపం దిగినట్టైంది: దినేశ్ కార్తీక్