13 ఏళ్లుగా ఎదురుచూస్తున్నా..
సొంత రాష్ట్రానికి చెందిన అతన్ని కాదని చెన్నై సూపర్ కింగ్స్ .. జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీని తీసుకుంది. అలా తనను కాదని సీఎస్కే.. ధోనీని తీసుకున్నప్పుడు తన గుండెలో గునుపం దిగినట్లు అయిందని తాజాగా దినేశ్ కార్తీక్ వెల్లడించాడు. క్రిక్బజ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ పిలుపు కోసం తాను 13 ఏళ్లుగా ఎదురుచూస్తున్నట్లు ఈ కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ చెప్పుకొచ్చాడు. 2008లో జరిగిన తొలి ఐపీఎల్ సీజన్ వేలంలో సీఎస్కే తనని ఫస్ట్లోనే కొనుగోలు చేస్తుందని ఆశించినట్లు తెలిపాడు.
ధోనీ కూడా ఊహించలేదు..
‘2008 ఐపీఎల్ సీజన్ వేలం సమయంలో నేను ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాను. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ తమిళనాడుకి చెందినది కావడంతో.. ఆ రాష్ట్రానికి చెందిన నేను అప్పటికే టీమిండియాలో ఆడుతుండటంతో నన్ను ఫస్ట్ కొనుగోలు చేస్తారని ధీమాగా ఉండిపోయాను. అయితే.. కెప్టెన్సీ ఇస్తారా లేదా అని మాత్రమే సందేహం ఉండేది. కానీ.. అనూహ్యంగా 1.5 మిలియన్లకు ధోనీని కొనుగోలు చేశారు.
ఆ టైమ్లో ధోనీ నా పక్కనే కూర్చుని ఉన్నాడు. దీని గురించి అతను ఓ ముచ్చటైనా నాతో చెప్పలేదు. బహుశా ధోనీ కూడా ఆ ఎంపికను ఊహించలేదనుకుంటా. నన్ను కాదని ధోనీని ఎంపిక చేయడం చాలా బాదేసింది. ఆ తర్వాతైనా ఎంపికచేస్తారని భావించా. కానీ ఇప్పటికీ 13 ఏళ్లు అయినా ఆ అవకాశం దక్కలేదు. చెన్నై ఫ్రాంఛైజీ పిలుపు కోసం ఎదురుచూస్తున్నా'అని దినేశ్ కార్తీక్ చెప్పుకొచ్చాడు.
6 ఫ్రాంచైజీలు మారిన కార్తీక్..
తన ఐపీఎల్ కెరీర్లో కార్తీక్ మొత్తం 6 ఫ్రాంచైజీలు మారాడు. 2008 ఐపీఎల్ సీజన్ వేలంలో దినేశ్ కార్తీక్ను ఢిల్లీ క్యాపిటల్స్ (ఢిల్లీ డేర్డెవిల్స్) కొనుగోలు చేయగా.. మూడు సీజన్ల తర్వాత అతను ముంబై ఇండియన్స్ టీమ్కు మారాడు. ఆ తర్వాత కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ లయన్స్ జట్లకు ఆడాడు. అనంతరం కోల్కతా నైట్రైడర్స్ జట్టు తరఫున బరిలోకి దిగాడు.
గంభీర్ తప్పుకోవడంతో..
ఐపీఎల్ 2018 సీజన్కు ముందు కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి గౌతమ్ గంభీర్ తప్పుకోగా.. దినేశ్ కార్తీక్ జట్టును నడిపించాడు. అయితే.. గత రెండు సీజన్లలో కెప్టెన్గా దినేశ్ కార్తీక్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. దీంతో.. 2020 సీజన్కు కార్తీక్ బదులు వేరొకరిని కెప్టెన్గా చేయాలని డిమాండ్ వ్యక్తమైంది. కెప్టెన్సీ రేసులో శుభమన్ గిల్ ముందువరుసలో ఉన్నాడు.
ఇక 2019 ప్రపంచకప్లో న్యూజిలాండ్తో జరిగిన సెమీస్ మ్యాచ్లో ఏడో స్థానంలో రావాల్సిన తనను ధోనీ కన్నా ముందే ఐదో స్థానంలో బ్యాటింగ్కు పంపినప్పుడు షాక్ గురయ్యానని కార్తీక్ తెలిపాడు. వికెట్ల పడకుండా తాను చేసిన ప్రయత్నం ఫలించలేదని, జిమ్మీ నీషమ్ అద్భుత క్యాచ్తో వెనుదిరగాల్సి వచ్చిందన్నాడు. ఆ మ్యాచ్లో ఆఖరి వరకు పోరాడిన భారత్ 18 పరుగులతో ఓటమిపాలైన విషయం తెలిసిందే.
నిక్కర్ మీదున్న నన్ను బ్యాటింగ్కు వెళ్లమంటే షాకయ్యా: కార్తీక్