బలాలపై కసరత్తు చేశా..
ఈ రెండేళ్లు నా ఆటపైనే ఏకాగ్రత నిలిపా. బలహీనతలపై కసరత్తు చేసి ఆటలో మెరుగయ్యేందుకు ప్రయత్నించా. బలాలపై మరింత ఎక్కువగా కసరత్తు చేశా. మెరుగవ్వాల్సిన ప్రాంతాలపై దృష్టిసారించి బలంగా తయారయ్యా. కెరీర్లో ఎదురైన అవరోధాలు నన్ను దృఢంగా మార్చాయి. మానసికంగా బలంగా తీర్చిదిద్దాయి. ఏం జరిగినా పోరాడాలి.. అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనే దిశగా ఆలోచన విధానాన్ని మార్చుకున్నా.2017లో నా భుజం డిస్ లొకేట్ అవ్వడంతో శస్త్రచిక్సిత తప్పలేదు. ఒక ఏడాది పాటు ఏ టోర్నీలోనూ పాల్గొనలేదు. 2018లో తిరిగి వచ్చా. కానీ మునుపటి ఫామ్లో లేను. దీంతో కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడలు, ప్రపంచ ఛాంపియన్షిప్లకు దూరమయ్యా. అయినా నేను విడిచిపెట్టలేదు. 2019లో రీఎంట్రీ తర్వాత వెనుదిరిగి చూడలేదు.
ఒలింపిక్స్ మెడల్ గెలవడమే..
నేషనల్స్కు ముందు 'పారిస్' సన్నాహాలు మొదలయ్యాయని నా ఇన్స్టాలో ఓ పోస్ట్ పెట్టా. అప్పటి నుంచి నా మైండ్లో మెగా గేమ్సే మెదులుతున్నాయి. ఏ టోర్నీ అయినా గెలుపు, ఓటమి గురించి ఆలోచించడం లేదు. అనుభవం సాధించాలనే లక్ష్యంతోనే ముందుకెళ్తున్నా. ఈ అనుభవం నాకు ఒలింపిక్స్లో పనికొస్తుంది. నా దేశం తరఫున ఒలింపిక్స్లో మెడల్ గెలిచేందుకు శాయశక్తుల కృషి చేస్తా. నా బలహీనతలేంటో నాకు తెలుసు. వాటినే నా బలంగా మార్చుకున్నా.
మేరీ కోమ్తో పోటీనా..?
మేరీకోమ్, సరితా దేవి లెజెండరీ బాక్సర్లు. వారి సరసన చోటు దక్కడం చాలా హ్యాపీగా, గర్వంగానూ ఉంది. మేరీకి చాలా అనుభవం ఉంది. ఎన్నో రికార్డులు సృష్టించింది. కానీ ఇద్దరు బాక్సర్లు రింగ్లో వెళ్తే ఒక్కరే గెలుస్తారు. క్వాలిఫయింగ్లో ఆమె గెలిచి టోక్యో ఒలింపిక్స్కు వెళ్లింది. దురదృష్టంకొద్దీ పతకం మిస్ చేసుకుంది. కామన్వెల్త్ ట్రయల్స్లో మేరీ 48 కేజీల్లో బరిలోకి దిగుతుందని విన్నా. కాబట్టి మేమిద్దరం మళ్లీ పోటీ పడే చాన్స్ లేదనుకుంటున్నా.
50 కేజీల కేటగిరిలో..
కామన్వెల్త్ క్రీడల్లో 50 కేజీల విభాగం ఉంది. వెయిట్ కేటగిరీని మార్చడం చాలా కష్టం. బరువు పెరగాలి లేదా తగ్గాలి. బరువు పెంచుకుని ఎక్కువ వెయిట్ కేటగిరీలోకి వెళితే ప్రతికూలత ఎదురవుతుంది. బరువు తగ్గించుకుని ఆ విభాగంలోకి వచ్చేవాళ్లు కాస్త బలంగా ఉంటారు. బలమైన బాక్సర్లు ఎదురవుతారు. 50 కేజీల విభాగంలో బరిలో దిగితే పెద్దగా తేడా ఉండకపోవచ్చు. ప్రస్తుతం నా బరువు 51 నుంచి 51.5 కేజీల మధ్యలో ఉంటుంది. కాబట్టి 50 కేజీల విభాగంలో నేను బాగా ఆడగలను.కొంతకాలం పాటు 50 కేజీల కేటగిరీలో కొనసాగుతా. దేహాన్ని అత్యుత్తమ దశలో ఉంచడమే ఇప్పుడు సవాల్.'అని నిఖత్ జరీన్ చెప్పుకొచ్చింది.