హైదరాబాద్: ఇండోనేషియా రాజధాని జకార్తా వేదికగా ఆగస్టు 18 నుంచి ఆరంభమయ్యే ఆసియా గేమ్స్లో భారత బ్యాడ్మింటన్ టీమ్ సత్తా చాటుతుందని స్టార్ షట్లర్ పీవీ సింధు ధీమా వ్యక్తం చేసింది. ఆసియా గేమ్స్కు సన్నద్ధమవుతున్న వేళ తాజాగా బుధవారం పీవీ సింధు మీడియాతో మాట్లాడారు.
ఏషియాడ్: ఆసియా గేమ్స్కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?
"ఆసియా గేమ్స్లో మెరుగైన ప్రదర్శన చేస్తాం. ఈసారి టీమ్ ఈవెంట్స్తో పాటు వ్యక్తిగత విభాగంలోనూ పోటీపడుతున్నాం. ఈ టోర్నీకి సిద్ధమయ్యేందుకు మాకు చాలా తక్కువ సమయం దొరికింది. అయినా సరే శ్రమించి గత టోర్నీ కంటే ఎక్కువ పతకాలు గెలిచేందుకు ప్రయత్నిస్తాం. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో రజతం గెలవడంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది" అని తెలిపారు.
చైనాలోని నాన్జింగ్ వేదికగా ఇటీవలే ముగిసిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఫైనల్లో మారిన్ చేతిలో ఓటమిపాలై రజతంతో సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే. కాగా, 2014లో జరిగిన ఆసియా గేమ్స్లో భారత బ్యాడ్మింటన్ టీమ్ కాంస్య పతకం గెలుపొందగా.. ఈ ఏడాది మరింత మెరుగైన ప్రదర్శన చేయాలనే పట్టుదలతో భారత షట్లర్లు ఉన్నారు.
ఈ ఏడాది జరిగే ఆసియా గేమ్స్లో పీవీ సింధు టీమ్ ఈవెంట్తో పాటు సింగిల్స్లోనూ పీవీ సింధు పోటీపడనుంది. కాగా, ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 2 వరకు రాజధాని జకార్తా, పాలెంబంగ్లలో ఈ ఆసియా గేమ్స్ను నిర్వహించనున్నారు. మొత్తం 40 క్రీడాంశాల్లోని 465 ఈవెంట్లకు పోటీలు జరుగనున్నాయి.
ప్రస్తుతం జరగబోయే ఆసియా గేమ్స్లో 45 దేశాలు పాల్గొననున్నాయి. ఈసారి పోటీలకు ఇండోనేసియాలోని జకార్తా, పాలెంబాంగ్ నగరాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే సర్వం సిద్ధమైంది. ఇలా రెండు నగరాలు వేదికగా నిలవడం ఆసియా గేమ్స్ చరిత్రలో ఇదే తొలిసారి.