టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపై స్టార్ ఓపెనర్ సంజూ శాంసన్ ప్రశంసల జల్లు కురిపించాడు. వైభవ్ సూర్యవంశీ వీడియో గేమ్లా క్రికెట్ ఆడుతున్నాడని కొనియాడాడు. ఐపీఎల్ 2025 సీజన్లో తమ కోచ్ రాహుల్ ద్రవిడ్ సర్కు చెప్పి మరీ ఫస్ట్ బాల్ను సిక్సర్ తరలించాడని సంజూ శాంసన్ గుర్తు చేసుకున్నాడు.
న్యూఢిల్లీ వేదికగా ఆదివారం జరిగిన బీసీసీఐ నమాన్ అవార్డ్స్ కార్యక్రమంలో సంజూ శాంసన్ ఈ వివరాలను వెల్లడించాడు. హోస్ట్ హర్ష భోగ్లే.. వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ అరంగేట్రం గురించి మాట్లాడుతుండగా.. సంజూ జోక్యం చేసుకున్నాడు. వైభవ్ ఐపీఎల్ అరంగేట్రానికి ముందు తమ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్తో జరిగిన సంభాషణను గుర్తు చేసుకున్నాడు.

లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్కు ముందు రాహుల్ ద్రవిడ్ సర్ తనను పిలిచాడని చెప్పిన సంజూ శాంసన్.. వైభవ్ చిన్న పిల్లాడని, అరంగేట్ర మ్యాచ్లో ఎలా ఆడాలో గైడెన్స్ ఇద్దామని చెప్పి అతన్ని పిలవమన్నారు. తమ రూమ్లోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీని.. ద్రవిడ్ సర్ రేపటి మ్యాచ్ ప్లాన్ ఏంటి? అని అడిగారు. దానికి వైభవ్ చాలా కూల్గా 'ఏం లేదు సార్.. నేను ఆడుతాను అంతే'అని బదులిచ్చాడు.
మళ్లీ ద్రవిడ్ సర్ సర్ది చెబుతూ.. 'అలా కాదు వైభవ్.. నీ గేమ్ ప్లాన్ ఏంటి? నువ్వు ఎలా బ్యాటింగ్ చేద్దాం అనుకుంటున్నావు?'అని మళ్లీ అడిగారు. 'కాదు వైభవ్.. నీ గేమ్ ప్లాన్ ఏంటి? నువ్వు ఎలా బ్యాటింగ్ చేద్దాం అనుకుంటున్నావు?'అని మళ్లీ ప్రశ్నించారు.
అప్పుడు వైభవ్ ఏమాత్రం తడుముకోకుండా.. 'ఒకవేళ మొదటి బంతి నా జోన్లోకి వస్తే సిక్సర్ కొడుతాను'అని బదులిచ్చాడు. వాడు చెప్పినట్టే ఫస్ట్ బాల్నే సిక్సర్ కొట్టాడని సంజూ శాంసన్ నవ్వుతూ చెప్పాడు. 'వాడు క్రికెట్ ఆడుతున్నాడా? లేక ఏదైనా వీడియో గేమ్ ఆడుతున్నాడా? అని నాకు అనిపించింది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. వాడు చెప్పినట్టుగానే గ్రౌండ్ లోకి వెళ్లి ఫస్ట్ బాల్నే సిక్సర్ కొట్టాడు.' అని సంజూ నవ్వులు పూయించాడు.
సంజూ మాటలతో రాహుల్ ద్రవిడ్తో పాటు అక్కడ ఉన్న అందరూ పడి పడి నవ్వుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఐపీఎల్ 2025 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ.. శార్దూల్ ఠాకూర్ వేసిన ఫస్ట్ బాల్కే సిక్సర్ తరలించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అదే జోరు కొనసాగించిన వైభవ్ సూర్యవంశీ.. భారత అండర్ 19 ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.