భారత్ నుంచి సింధు, ప్రణీత్..
నిబంధనల ప్రకారం సింగిల్స్లో టాప్-16 ర్యాంకింగ్స్లో ఒక దేశం నుంచి గరిష్టంగా ఇద్దరికి ఒలింపిక్స్లో నేరుగా పాల్గొనే అవకాశం లభిస్తుంది. భారత్ నుంచి మహిళల సింగిల్స్లో పీవీ సింధు ఏడో ర్యాంక్లో... సైనా 22వ ర్యాంక్లో... పురుషుల సింగిల్స్లో సాయిప్రణీత్ 13వ ర్యాంక్లో... శ్రీకాంత్ 20వ ర్యాంక్లో ఉన్నారు. దాంతో భారత్ నుంచి సింధు, సాయిప్రణీత్ టోక్యో ఒలింపిక్స్కు అర్హత పొందారు. పురుషుల డబుల్స్లో ఎనిమిదో ర్యాంక్లో ఉన్న సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జంట టోక్యో ఒలింపిక్స్లో భారత్కు ప్రాతినిధ్యం వహించనుంది.
క్వాలిఫికేషన్ ప్రక్రియ ముగిసింది..
'టోక్యో ఒలింపిక్స్ అర్హత సమయంలో మరే టోర్నీలు నిర్వహించం. ఒలింపిక్స్ అర్హతకు సవరించిన తుది గడువు జూన్ 15న అధికారికంగా ముగుస్తుంది. టోక్యో ర్యాంకింగ్ జాబితాలో ఎలాంటి మార్పులు ఉండవు. క్రీడాకారులకు పాయింట్లు సాధించే అవకాశాలు లేనందున ఒలింపిక్స్ అర్హత ప్రక్రియను మూసేశాం. అయితే షట్లర్ల ఎంట్రీల విషయంలో జాతీయ ఒలింపిక్ కమిటీలు, సభ్య దేశాల నుంచి ధ్రువీకరణలు రావాల్సి ఉన్నాయి. అప్పుడు ఏమైనా మార్పులు ఉంటే చెప్పలేం. ఈ ప్రక్రియకు కొన్ని వారాల సమయం పడుతుంది'' అని బీడబ్ల్యూఎఫ్ ఓ ప్రకటనలో తెలిపింది.
పునరాలోచన చేయాలి..
కరోనా కారణంగా 6 టోర్నీలు రద్దయ్యాయని, క్రీడాకారులకు నష్టం కలగకుండా కొత్త నిబంధనలు రూపొందించాలని శ్రీకాంత్ విజ్ఞప్తి చేశాడు. 'ఒలింపిక్స్ అర్హత ప్రక్రియ ముగియడం.. టోక్యోకు అవకాశం లభించకపోవడం కొంచెం నిరాశ కలిగించింది. కరోనా మహమ్మారి కారణంగా 5, 6 టోర్నీలు రద్దయ్యాయి. ఇది మన చేతుల్లో లేదు. నాతో పాటు చాలామందిపై టోర్నీల రద్దు ప్రభావం పడింది. ఒలింపిక్స్ అర్హత కోసం నాకు 5000 నుంచి 6000 పాయింట్లు అవసరం ఉంది. 4, 5 టోర్నీల్లో ఓ స్థాయిలో ఆడినా ఆ పాయింట్లు లభించేవి. ఏకంగా టోర్నీలే రద్దయినప్పుడు ఏం చేయలేం. 6 టోర్నీలు ఇలా రద్దవడంపై బీడబ్ల్యూఎఫ్ ఆలోచించాలి. ఇలాంటప్పుడు క్రీడాకారులకు నష్టం కలగకుండా కొత్త నిబంధనలు రూపొందించాలి.'అని శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు.
ఒలింపిక్స్ జరిగెనా?
ఇక కరోనా కారణంగా గత సంవత్సరం జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ ఈ ఏడాదికి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా ఈ మెగా ఈవెంట్ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి. జపాన్లోని మెజార్టీ ప్రజలు ఈ సమ్మర్ గేమ్స్ను వ్యతిరేకిస్తున్నారు. జపాన్ వైద్యుల బృందం కూడా ఒలింపిక్స్ నిర్వహణపై ఆందోళన వ్యక్తం చేస్తుంది. మెగా ఈవెంట్ నిర్వహించడం వల్ల కొత్త వైరస్ స్ట్రెయిన్ పుట్టుకొచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. ఒలింపిక్ స్ట్రెయిన్ అని పిలుస్తారని, ఇది వందేళ్ల వరకు ప్రభావం చూపుతుందన్నారు.