న్యూఢిల్లీ: వరల్డ్ చాంపియన్ పీవీ సింధు.. వచ్చే నెలలో జరగనున్న థామస్ అండ్ ఉబెర్ కప్లో ఆడుతుందని జాతీయ బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) అధ్యక్షుడు హిమంత బిస్వ శర్మ చెప్పారు. వ్యక్తిగత కారణాలతో ఈ టోర్నీ నుంచి తప్పుకొంటున్నట్టు సింధు తొలుత ప్రకటించింది. తన కుటుంబసభ్యులకు చెందిన వేడుక కోసం ఈ టోర్నీలో ఆడనని చెప్పింది. అయితే భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) చీఫ్ హిమంత బిశ్వ శర్మ ఆమెను ఆడేందుకు ఒప్పించినట్లు తెలిసింది.
'ఆ టోర్నీలో భారత్కు సానుకూలమైన 'డ్రా' ఉండటంతో ఆడాల్సిందిగా సింధును కోరాను. ఆమె జట్టుతో కలిసి ఆడితే భారత్కు పతకం అవకాశాలుంటాయని చెప్పాను. దీంతో ఆమె బరిలోకి దిగేందుకు సమ్మతించింది' అని హిమంత బిశ్వ శర్మ ట్వీట్ చేశారు. సింధు తన కుటుంబానికి చెందిన వేడుకను టోర్నీ ప్రారంభానికంటే ముందుగా నిర్వహించుకుంటానని తనతో చెప్పినట్లు ఆయన వివరించారు. డెన్మార్క్లో వచ్చేనెల 3 నుంచి 11 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. 'బాయ్' ఈ టీమ్ ఈవెంట్ కోసం 26 మంది షట్లర్లకు హైదరాబాద్లోని గోపీచంద్ అకాడమీలో శిబిరం నిర్వహిస్తోంది. 17న తుది జట్లను ఎంపిక చేస్తారు.
ఇక భారత పురుషుల డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి.. ఈ ఉబెర్ కప్కు దూరమయ్యారు. తెలుగు ప్లేయర్ సాత్విక్ ఇటీవల కరోనా బారిన పడడమే ఇందుకు కారణం. ఈ మేరకు బాయ్కు సమాచారమిచ్చారు. నేషనల్ స్పోర్ట్స్ డేకు కొద్ది రోజుల ముందు సాత్విక్ కరోనా పాజిటివ్గా తేలాడు. దాంతో అర్జున అవార్డు కూడా అందుకోలేకపోయాడు. శనివారంతో సాత్విక్ క్వారంటైన్ పూర్తయింది. మరోసారి కరోనా టెస్ట్ చేయించుకోనున్నాడు. ఇందులో నెగెటివ్ వచ్చినా.. మరో పది రోజులు దాకా ప్రాక్టీస్కు రాలేడు. భాగస్వామి అందుబాటులో లేకపోవడంతో చిరాగ్ కూడా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. వీరి నిర్ణయానికి బాయ్ కూడా ఓకే చెప్పింది.