హోరా హోరీ..
59 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సింధు తొలి గేమ్ లో గెలిచినా ఆ తర్వాత అదే జోరు కనబర్చలేకపోయింది. రెండో గేమ్లో వరుసగా ఐదు పాయింట్లు కోల్పోయి 0-5 తో వెనుకబడిన సింధు ఆ తర్వాత కోలుకోలేకపోయింది. నిర్ణాయక మూడో గేమ్ ఆరంభంలో ఇద్దరు ప్రతి పాయింట్ కోసం పోరాడటంతో ఆట హోరాహోరీగా సాగింది. ఒకదశలో సింధు 13-14తో తై జు యింగ్ ఆధిక్యాన్ని ఒక పాయింట్కు తగ్గించింది. ఈ దశలోనే తై జు వరుసగా మూడు పాయింట్లు సాధించి 17-13తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివరిదాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న తై జు యింగ్ విజయాన్ని ఖాయం చేసుకుంది.
అనవసర తప్పిదాలతో..
ఇక పురుషుల సింగిల్స్ గ్రూప్ 'బి' మ్యాచ్లో ప్రపంచ మాజీ నంబర్వన్ శ్రీకాంత్ 21-15, 16-21, 18-21తో ప్రపంచ మూడో ర్యాంకర్ ఆండెర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్) చేతిలో ఓటమి చవిచూశాడు. 77 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో శ్రీకాంత్ కీలకదశలో తప్పిదాలు చేశాడు. నిర్ణాయక మూడో గేమ్లో 17-16తో ఆధిక్యంలోకి వెళ్లిన శ్రీకాంత్ ఈ దశలో వరుసగా నాలుగు పాయింట్లు సమర్పించుకొని తేరుకోలేకపోయాడు. తై జు యింగ్ చేతిలో సింధుకిది 13వ ఓటమికాగా... ఆంటోన్సెన్ చేతిలో శ్రీకాంత్కు రెండో పరాజయం.
సెమీఫైనల్ ఆశలు..
నేడు(గురువారం) జరిగే రెండో రౌండ్ లీగ్ మ్యాచ్ల్లో ప్రపంచ మాజీ చాంపియన్ ఇంతనోన్ రచనోక్ (థాయ్లాండ్)తో సింధు... వాంగ్ జు వె (చైనీస్ తైపీ)తో శ్రీకాంత్ ఆడతారు. సెమీఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్ల్లో సింధు, శ్రీకాంత్ గెలవాల్సి ఉంటుంది. ఓడిన తన ఆటపై సింధు సంతృప్తి వ్యక్తం చేసింది. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. 'మ్యాచ్ బాగా జరిగింది. ఏ పాయింట్ కూడా సులువుగా రాలేదు. మూడో గేమ్లో ఇద్దరి మధ్య పాయింట్ల అంతరం ఒక పాయింట్కు చేరుకుంది కూడా. అయితే ర్యాలీల సందర్భంగా రెండుసార్లు నా రాకెట్ స్ట్రింగ్స్ దెబ్బతినడం తుది ఫలితంపై ప్రభావం చూపింది' అని సింధు వ్యాఖ్యానించింది.