కౌలాలంపూర్: మలేసియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నీలో భారత స్టార్ షట్లర్ హెచ్.ఎస్. ప్రణయ్ జైత్రయాత్ర ముగిసింది. సెమీఫైనల్లో అతనికి ఓటమి ఎదురైంది. శనివారం హోరాహోరీగా సాగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్ మ్యాచ్లో ప్రణయ్ 21-17, 9-21, 17-21తో ఎన్జీ క లాంగ్ (హాంకాంగ్) చేతిలో పరాజయంపాలయ్యాడు. లాంగ్తో గెలుపోటముల్లో 4-4తో సమానంగా ఉన్న ప్రణయ్ పూర్తి విశ్వాసంతో మ్యాచ్ ఆరంభించాడు. సుదీర్ఘ ర్యాలీలతో ప్రత్యర్థిని ఇబ్బందిపెడుతూ.. చక్కటి ప్లేస్మెంట్లతో పాయింట్లు సాధిస్తూ ఆధిపత్యం ప్రదర్శించి తొలి గేమ్ను గెలుచుకున్నాడు.
అయితే రెండో గేమ్ నుంచి కథ మారింది. అప్పటివరకు షటిల్పై పూర్తి నియంత్రణ కనబర్చిన ప్రణయ్ తడబడ్డాడు. ఏ దశలోనూ అతడు కోలుకోలేకపోయాడు. వరుసగా రెండు గేమ్లు ఓడిపోయాడు. సెమీస్లో ఓడిన ప్రణయ్కు 5,220 డాలర్ల (రూ. 4 లక్షల 13 వేలు) ప్రైజ్మనీ లభించింది.
క్వార్టర్ ఫైనల్లో హెచ్ఎస్ప్రణయ్ 25-23, 22-20 తేడాతో ప్రపంచ 14వ ర్యాంకర్, జపాన్ స్టార్ కంటా త్సునెయమాను ఓడించాడు. కానీ ఆ జోరును సెమీఫైనల్లో కొనసాగించలేకపోయాడు.
ఈ టోర్నీలో ప్రణయ్ ఒక్కడే సెమీస్ చేరగా.. స్టార్ట్ షట్లర్, మాజీ వరల్డ్ చాంపియన్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్కే పరమితమైంది. గత శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ తై జూయింగ్ (చైనీస్ తైపీ) చేతిలో సింధూ ఓటమి పాలైంది. 55 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో 13-21, 21-12, 12-21 తేడాతో సింధూ పరాజయం పాలైంది. తై జూయింగ్ చేతిలో సింధుకు వరుసగా ఇది ఏడో ఓటమి కావడం గమనార్హం.
ఇక ఇటీవల జరిగిన మలేషియా ఓపెన్ క్వార్టర్ఫైనల్స్లోను సింధూపై తై జూ గెలుపొందింది. ఇక ఓవరాల్గా ఇప్పటి వరకు 22 మ్యాచ్ల్లో వీరిద్దరూ తలపడగా.. 5 మ్యాచ్ల్లో సిందూ,17 మ్యాచ్ల్లో తై జూ విజయం సాధించింది. సాయి ప్రణీత్, కశ్యప్ ప్రీ క్వార్టర్లోనే నిష్క్రమించగా.. సైనా నెహ్వాల్ తొలి రౌండ్లోనే వెనుదిరిగింది.