జకార్తా: ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సాయిప్రణీత్ల పోరాటం ముగిసింది. తొలి రౌండ్లోనే ఈ స్టార్ షట్లర్లు ఇంటిముఖం పట్టారు. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఏడో సీడ్ సింధు 14-21, 18-21తో హి బింగ్ జియావో (చైనా) చేతిలో ఓడింది. 47 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో సింధు క్రాస్ కోర్ట్ షాట్స్ ఆడటంలో ఇబ్బంది పడింది.
ఆరంభం నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన బింగ్ జియావో విరామ సమయానికి 11-4తో ఆధిక్యంలో నిలిచింది. బ్రేక్ తర్వాత సింధు దూకుడుగా ఆడి 8-11తో ప్రత్యర్థికి సమీపంగా వచ్చినప్పటికీ ఫలితం లేకపోయింది. చైనా షట్లర్లు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగడంతో తడబడిన సింధు వరుస పాయింట్లు చేజార్చుకుని గేమ్ను కోల్పోయింది.
రెండో గేమ్లోనూ బింగ్ జియావో అదే జోరు కొనసాగించింది. మెరుపు షాట్లతో సింధును కుదురుకోనీయకుండా చేసిన బింగ్ జియావో ఆరంభంలోనే 5-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత అదే జోరుతో గేమ్తో పాటు మ్యాచ్ను దక్కించుకుంది. ఇటీవల కాలం సింధుకు ఎదురైన అత్యంత ఘోర పరాజయం ఇదే.
పురుషుల సింగిల్స్లో సాయిప్రణీత్ 16-21, 19-21తో హన్స్ క్రిస్టియన్ (డెన్మార్క్) చేతిలో ఓడాడు. మరోవైపు సమీర్వర్మ రెండో రౌండ్ చేరాడు. అతడు 21-19, 21-15తో థామస్ రౌక్సెల్ (ఫ్రాన్స్)పై నెగ్గాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్రెడ్డి-మను అత్రి 8-21, 11-21తో తకురోహోకి-యుగో (జపాన్) చేతిలో ఓడారు.