బ్యాంకాక్: కరోనా బ్రేక్ తర్వాత ఆడిన రెండు టోర్నీ (థాయ్లాండ్ ఓపెన్)ల్లోనూ నిరాశపరిచిన భారత టాప్ షట్లర్లు పీవీ సింధు, కొంత కాలంగా ఫామ్లో లేని కిడాంబి శ్రీకాంత్ ఇప్పుడు మెగా ఈవెంట్కు సిద్ధమయ్యారు. వీరిద్దరూ బుధవారం నుంచి జరిగే ప్రతిష్ఠాత్మక బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్లో మెరుగైన ప్రదర్శనే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. టఫ్ కాంపిటీషన్ ఉండే ఈ టోర్నీలో భారత్ నుంచి ఈ ఇద్దరు మాత్రమే పోటీ పడుతున్నారు.
2018లో ఈ టైటిల్ నెగ్గిన సింధు.. గ్రూప్ 'బి' తరఫున టాప్ ర్యాంకర్లు తై జు యింగ్, రచనోక్ ఇంటాన్, పోర్న్పవె చొచోవోంగ్తో కలిసి పోటీపడనుంది. తొలి మ్యాచ్లో భాగంగా బుధవారం రెండో సీడ్ తై జు (చైనీస్ తైపీ)తో సింధు ఆడనుంది. తై జుతో ముఖాముఖి పోరులో 5సార్లు గెలిచిన సింధు.. ఏకంగా 15సార్లు ఓడడం గమనార్హం.
పురుషుల సింగిల్స్ గ్రూప్-బిలో శ్రీకాంత్తోపాటు ఆండ్రెస్ ఆంటాన్సెన్, వాంగ్ జు వి, ఎన్జి క లాంగ్ అంగస్ ఆడనున్నారు. తొలి మ్యాచ్లో తైపీ షట్లర్ వాంగ్ జుతో శ్రీకాంత్ అమీతుమీ తేల్చుకోనున్నాడు. గ్రూప్-ఎ, బిలో టాప్-2లో నిలిచిన షట్లర్లు సెమీస్కు అర్హత సాధిస్తారు. ఇక.. బీడబ్ల్యూఎఫ్ నిబంధనల ప్రకారం పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాల్లో టాప్-8 ర్యాంకుల్లో ఉన్న షట్లర్లు మాత్రమే వరల్డ్ టూర్ ఫైనల్స్ ఆడేందుకు అర్హులు.
అయితే, ఆయా విభాగం నుంచి ఒక దేశం తరఫున గరిష్టంగా ఇద్దరు మాత్రమే ఆడాల్సి ఉంటుంది. దీంతో థాయ్లాండ్ నుంచి ముగ్గురు షట్లర్లు టాప్-8లో ఉండడం, జపాన్ స్టార్ ఒకుహర గైర్హాజరవడంతో.. సింధు పదో స్థానంలో ఉన్నప్పటికీ చివరి బెర్త్గా టోర్నీలో ఆడే అవకాశం దక్కించుకుంది. ఏడో ర్యాంకర్గా శ్రీకాంత్ టోర్నీలో ఆడుతున్నాడు. కాగా.. డబుల్స్లో భారత షట్లర్లకు ప్రాతినిథ్యం లభించలేదు.
విరాట్ కోహ్లీనే నా కెప్టెన్.. నేను అతని డిప్యూటీని మాత్రమే: అజింక్యా రహానే