విజయ సంకేతం:
సింధు విజయం అనంతరం భావోద్వేగంతో కోర్టులోనే విజయ సంకేతం చేసింది. అభిమానులకు అభివాదం చేసి, కోచ్ గోపిచంద్కు కృతజ్ఞతలు తెలిపింది. ఈ చారిత్రక విజయాన్ని తన తల్లి పీ విజయ పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు అంకితం చేస్తున్నట్టు సింధు ప్రకటించింది. హ్యాపీ బర్త్డే మామ్ అంటూ ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య ప్రకటించింది. పీవీ సింధూ కోర్టు నుంచి బయటకు నడచివస్తుండగా ప్రేక్షకులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు.
ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నా:
మ్యాచ్ అనంతరం సింధు మాట్లాడుతూ... 'ప్రస్తుతం చెప్పలేనంత సంతోషంగా ఉంది. ఈ రోజు కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నా. సంతోషాన్ని వ్యక్తం చేసేందుకు మాటలు చాలడం లేదు. గత రెండు సంవత్సరాలు రజతమే దక్కింది. ఈసారి ఎలాగైనా స్వర్ణం సాధించాలనుకున్నా. ఆర్నెల్లుగా కష్టపడ్డా. ప్రతిఫలం లభించింది. భారత్కు తొలి స్వర్ణం అందించడం గర్వకారణంగా ఉంది' అని సింధు అన్నారు.
అపుడు ఎంతో గర్వంగా అనిపించింది:
'ఈ విజయం చాలా ప్రత్యేకం. ఎందుకంటే.. బ్యాడ్మింటన్లో ప్రపంచ ఛాంపియన్షిప్ అత్యున్నత టోర్నీ. ఒలింపిక్స్కు ఏమాత్రం తీసిపోదు. ఇక్కడ పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది. వరుసగా మూడో ఏడాది ఫైనల్ చేరుకోవడం చాలా బాగుంది. త్రివర్ణ పతాకం పైకి వెళ్తున్నప్పుడు, జాతీయ గీతం ఆలపిస్తున్నప్పుడు ఎంతో గర్వంగా అనిపించింది. నాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నా విజయానికి కోచ్లు గోపీచంద్, కిమ్.. తల్లిదండ్రులు, సహాయక సిబ్బంది కారణం' అని సింధు పేర్కొన్నారు.
పీవీ సింధును చూసి భారత్ మరోసారి గర్విస్తోంది: మోడీ
క్వార్టర్స్లో గెలుపే మలుపు:
ప్రపంచంలో అత్యుత్తమ క్రీడాకారిణుల్లో తై జు ఒకరు. ఆమెను ఓడిస్తేనే స్వర్ణం నెగ్గుతానని తెలుసు. క్వార్టర్స్ పోరులో తొలి గేమ్ కోల్పోయినా.. ఆశలు వదులుకోలేదు. చివరి పాయింటు వరకు గెలుపు కోసం ప్రయత్నించా. క్వార్టర్స్లో గెలుపే ప్రపంచ ఛాంపియన్షిప్లో మలుపు. ఒకుహర ర్యాలీ ప్లేయర్. సుధీర్ఘంగా ర్యాలీలు ఆడుతుంది. మొదటి పాయింటు నుంచే దూకుడుగా ఆడా. ర్యాలీలను తిప్పికొడుతూ డిఫెన్స్ను దెబ్బతీశా. దీంతో ఒకుహర ఒత్తిడిలోకి వెళ్లింది' అని సింధు తెలిపారు.
ఈ విజయం అమ్మకు అంకితం:
'ఆటలో గెలుపోటములు సహజం. కోర్టులో దిగాక నూటికి నూరుశాతం ప్రదర్శన ఇవ్వడమే ముఖ్యం. గత ఫైనల్స్ గురించి ఆలోచించలేదు. క్వార్టర్స్, సెమీస్ మ్యాచ్లాగే సహజసిద్ధంగా ఆడి విజయం సాధించా. ఈ విజయాన్ని అమ్మకు అంకితమిస్తున్నా. ఈ రోజు ఆమె జన్మదినం. ఆమెకు ఏదో ఒక బహుమతి ఇవ్వాలనుకున్నా. చివరికి స్వర్ణ పతకాన్నే ఇస్తున్నా. నా తల్లిదండ్రుల వల్లే నేను ప్రస్తుతం ఇక్కడున్నా' అని సింధు చెప్పుకొచ్చారు.