లక్షణాల్లేవ్..
డబుల్స్లో తన భాగస్వామి చిరాగ్ శెట్టితో పాటు ఈ ఏడాది ‘అర్జున' అవార్డుకు సాత్విక్ ఎంపికయ్యాడు. ‘కొన్నిరోజుల క్రితమే యాంటిజెన్ పరీక్షకు హాజరయ్యా. ఆ తర్వాత చేసిన ఆర్టీ-పీసీఆర్ పరీక్షలోనూ కరోనా సోకినట్లు తేలింది. ఐదు రోజులుగా క్వారంటైన్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నా. జ్వరం, జలుబు, ఒళ్లునొప్పుల్లాంటి లక్షణాలేవీ లేవు. మరో మూడు రోజుల తర్వాత మళ్లీ కరోనా టెస్టు చేయించుకుంటా. అదృష్టవశాత్తు మా కుటుంబసభ్యులెవరికీ కరోనా పాజిటివ్ రాలేదు'అని ఆంధ్రప్రదేశ్లోని అమలాపురానికి చెందిన 20 ఏళ్ల సాత్విక్ తెలిపాడు.
మరో ఇద్దరికి కూడా..
సాత్విక్తోపాటు క్రీడా అవార్డులను దక్కించుకున్న మరో ఇద్దరికి కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) తెలిపింది. ఆయా ఆటగాళ్ల పేర్లను మాత్రం వెల్లడించలేదు. వారు కూడా అవార్డుల కార్యక్రమానికి దూరంగా ఉండనున్నట్టు పేర్కొంది. ఈ ఏడాది 74 మంది జాతీయ అవార్డులకు ఎంపికవగా 65 మంది శనివారం ఈ అవార్డును పొందనున్నట్లు ‘సాయ్' తెలిపింది. కొందరూ విదేశాల్లో ఉన్నారని పేర్కొంది.
క్రీడా చరిత్రలో తొలిసారిగా..
మరోవైపు కోవిడ్-19 నేపథ్యంలో జాతీయ క్రీడా అవార్డుల ప్రదానోత్సవం నిర్ణీత సమయానికి జరుగుతుందో లేదో అనే సందేహాల్ని పటాపంచలు చేస్తూ కేంద్రం వినూత్న సంప్రదాయానికి తెరతీసింది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి వర్చువల్ (ఆన్లైన్) వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. దేశ వ్యాప్తంగా ఉన్న ‘సాయ్' కేంద్రాలు ఇందుకు వేదికలుగా మారనున్నాయి. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ రాష్ట్రపతి భవన్ నుంచే వర్చువల్ పద్ధతిలో విజేతలకు అవార్డులను అందజేయనున్నారు. అవార్డులకు ఎంపికైన క్రీడాకారులంతా తమ నగరాల్లోని ‘సాయ్' కేంద్రాల్లో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొని అవార్డులను స్వీకరించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
సిక్కిరెడ్డి
ఇక సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్లో ఈ నెలారంభంలో జాతీయ బ్యాడ్మింటన్ శిక్షణ శిబిరం మొదలైన వెంటనే కరోనా కలకలం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ శిబిరానికి హాజరైన మహిళల డబుల్స్ స్టార్ సిక్కి రెడ్డి, ఫిజియోథెరపిస్ట్ కిరణ్ కరోనా వైరస్ బారిన పడటం షట్లర్లను ఆందోళనకు గురిచేసింది. మరోసారి వారికి పరీక్షలు నిర్వహించగా.. నెగెటివ్ ఫలితం వచ్చింది. దీంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.
లీసా స్టాలేకర్ క్రికెట్ జర్నీ.. పుణె అనాథాశ్రమం నుంచి ఐసీసీ 'హాల్ ఆఫ్ ఫేమ్' దాకా.!