హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన టాప్ పథకం(టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీం) నుంచి తనను తప్పించడం ఎంతో ఆశ్చర్యానికి గురిచేసిందని భారత సింగిల్స్ టెన్నిస్ ఆటగాడు యుకి బాంబ్రి పేర్కొన్నాడు. యుఎస్ ఓపెన్ టోర్నీ కారణంగా ఆసియా గేమ్స్లో ఆడలేకపోవడంతో యుకిని టాప్ పథకం నుంచి కేంద్ర క్రీడలశాఖ తప్పించింది.
దీనిపై యుకి బాంబ్రి మాట్లాడుతూ ''టాప్ పథకం ఉద్దేశం మేరకే నేను నడుచుకుంటున్నా. రెండేళ్లలో ఒలింపిక్స్లో పతకం సాధించేలా సిద్ధమవడమే టాప్ ఉద్దేశం. గ్రాండ్స్లామ్లో ఆడి ర్యాంకింగ్ మెరుగుపర్చుకొని నేరుగా ఒలింపిక్స్కు అర్హత సాధించాలని ప్రయత్నిస్తున్నా. దీంట్లో తప్పేముంది" అని అన్నాడు.
"యుఎస్ ఓపెన్లో ఆడడం ద్వారా ఉత్తమ ఆటగాళ్లతో తలపడే అవకాశం లభిస్తుంది. దాని ద్వారా నా ఆట మెరుగవుతుంది. టాప్ పథకం నుంచి తప్పించినందుకు ఆశ్చర్యంగా ఉంది. టాప్ పథకంలో చేర్చినా, ప్రభుత్వం నుంచి సాయం అందించినా లేదా అందించకపోయినా కూడా యుఎస్ ఓపెన్లో నేను ఆడతా'' అని అన్నాడు.
కాగా, ఈ మధ్య కాలంలో యుకి బాంబ్రి సూపర్ ఫామ్లో ఉన్నాడు. అంతేకాదు 100లోపు ర్యాంకు సాధించడం ద్వారా యుకి యుఎస్ ఓపెన్కు నేరుగా అర్హత సాధించాడు. ఇక, టాప్ నుంచి యుకి బాంబ్రిని తప్పించిన విషయమై ఆలిండియా టెన్నిస్ ఆసోసియేషన్( ఐటా) బాసటగా నిలిచింది.
టాప్ నుంచి యుకీని తప్పించడంపై మరోసారి ఆలోచించాలంటూ ఐటా కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖను కోరినట్లు ప్రకటించింది. ''నిర్ణయంపై పునారాలోచించాలని కోరాం. యుకీతో పాటు లియాండర్ పేస్ను కూడా టాప్ పథకంలో చేర్చాలని విన్నవించాం. మొదటి 64 ర్యాంకుల్లో ఉంటే టోక్యో ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించవచ్చని అలా జరగాలంటే యుకి యుఎస్ ఓపెన్ ఆడాలని వాళ్లకు చెప్పాం'' అని ఐటా కార్యదర్శి హిరణ్మయి ఛటర్జీ తెలిపారు.