
మహిళా టెన్నిస్ స్టార్ క్రీడాకారిణి, అమెరికా తార సెరెనా విలియమ్స్ ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీలో ఫైనల్ చేరింది. వింబుల్డన్ టోర్నీలో సెరెనా ఫైనల్ చేరడం ఇది 11వ సారి. దీంతో దిగ్గజ మహిళా క్రీడాకారిణి మార్గరెట్ కోర్ట్ (ఆస్ట్రేలియా) అత్యధిక గ్రాండ్ స్లామ్ రికార్డుకు అడుగు దూరంలో నిలిచింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్ సమరంలో 11వ సీడ్ సెరెనా 6-1, 6-2తో అన్సీడెడ్ బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్)పై సునాయాస విజయం సాధించింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఏకపక్షంగా సాగిన సమరంలో మొదటి సెట్ను 27 నిమిషాల్లో, రెండో సెట్ను 22 నిమిషాల్లో గెలిచి సెరెనా మ్యాచ్ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్లో సెరెనా మూడు ఏస్లతో పాటు 16 విన్నర్లు కొట్టింది. మరోవైపు స్ట్రికోవా కేవలం 8 విన్నర్లను, ఒక ఏస్ను మాత్రమే కొట్టింది.
మరో సెమీఫైనల్ మ్యాచ్లో రుమేనియా తార 7వ సీడ్ హలెప్ 6-1, 6-3తో 8వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్)పై వరుస సెట్లల్లో గెలిచి ఫైనల్ చేరింది. హలెప్ తన కెరీర్లోనే తొలిసారిగా వింబుల్డన్ మహిళల విభాగంలో ఫైనల్ చేరింది. ఐదుసార్లు స్వితోలినా సర్వీస్ బ్రేక్ చేసిన హలెప్.. ఏ దశలోనూ స్వితోలినాకు పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. హలెప్ 26 విన్నర్లతో పాటు ఒక ఏస్ కొట్టింది. స్వితోలినా ఒక సారి మాత్రమే బ్రేక్ చేసి కేవలం 10 విన్నర్లను కొట్టింది. శనివారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
శుక్రవారం జరిగే పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో టాప్సీడ్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా)తో బాటిస్టా అగట్ (స్పెయిన్) తలపడనున్నాడు. మరో సెమీఫైనల్లో రెండో సీడ్ రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్) మూడో సీడ్ రఫెల్ నాదల్ (స్పెయిన్)తో అమీతుమీ తేల్చుకోనున్నాడు. ఈ రోజు సాయంత్రం 5.30 నుంచి మ్యాచులు ప్రారంభం అవుతాయి.