
హైదరాబాద్: వింబుల్డన్ టోర్నీలో ఓ మ్యాచ్ ఓ చరిత్రకెక్కింది. వింబుల్డన్లో అత్యంత సుదీర్ఘ సమరం. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరున్నర గంటలు ఆడేశారు. వింబుల్డన్ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్ మ్యాచ్లో కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా), జాన్ ఇస్నర్ (అమెరికా) తలపడ్డారు.
6 గంటల 35 నిమిషాలపాటు నువ్వా నేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్లో అండర్సన్ 7-6 (8-6), 6-7 (5-7), 6-7 (9-11), 6-4, 26-24తో ఇస్నర్ను ఓడించి ఫైనల్కు దూసుకెళ్లాడు. టోర్నీలో భాగంగా నాదల్ (స్పెయిన్), జొకోవిచ్ (సెర్బియా) మధ్య జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచ్ విజేతతో ఆదివారం జరిగే ఫైనల్లో అండర్సన్ తలపడనున్నాడు.
ఇదిలా ఉంటే, మ్యాచ్ ఆరంభమైన తొలి క్షణం నుంచి చివరి క్షణం వరకూ ఇద్దరూ ప్రతీ పాయింట్కు, ప్రతీ గేమ్కు హోరాహోరీగా పోరాడారు. ఫలితంగా గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ల చరిత్రలోనే సుదీర్ఘంగా సాగిన రెండో మ్యాచ్గా ఈ మ్యాచ్ చరిత్రకెక్కింది. 2010 టోర్నీలో జాన్ ఇస్నెర్, మహుత్ (ఫ్రాన్స్) మధ్య జరిగిన తొలి రౌండ్ మ్యాచ్ ఏకంగా 11 గంటల 5 నిమిషాలు సాగింది.
అంతేకాదు ఈ మ్యాచ్ ప్రస్తుతం జరుగుతున్న వింబుల్డన్కే హైలెట్గా నిలిచింది. ఏస్లు వెల్లువలా దూసుకెళ్లిన ఈ మ్యాచ్లో తొలి మూడు సెట్లు టైబ్రేకర్లోనే తేలడం విశేషం. ఈ మ్యాచ్లో ఆఖరి సెట్ గేమ్కే హైలెట్గా నిలిచింది. దాదాపు రెండు గంటలు జరిగిన ఈ సెట్లో ఇద్దరూ భీకరంగా పోరాడారు. కనీసం ఒక్కసారి కూడా ఇద్దరూ బ్రేక్ సాధించలేకపోయారు.
ఇస్నర్-అండర్సన్ సర్వీసులు నిలబెట్టుకోవడంతో ఈ సెట్ సుదీర్ఘంగా సాగింది. దీంతో చెరో రెండో సెట్లు గెలిచారు. చివరకు నిర్ణాయక ఐదో సెట్లో ఎవరూ వెనక్కి తగ్గకుండా ఆడటంతో ఎలాంటి బ్రేక్ పాయింట్లు లేకుండా సెట్ సాగుతూపోయింది. చివరకు 49వ గేమ్లో ఇస్నెర్ సర్వీస్లో అండర్సన్ బ్రేక్ పాయింట్ సంపాదించి, తర్వాత తన సర్వీస్నూ నిలబెట్టుకొని గెలిచాడు. ఇస్నర్ 53 ఏస్లు వేయగా.. అండర్సన్ 49 ఏస్లు సంధించాడు.