హైదరాబాద్: ఇప్పటివరకు లేని విధంగా మహిళల సింగిల్స్లో జరిగిన సమరం శనివారం ఆశ్యర్యానికి, ఉత్కంఠకు గురి చేసింది. ఆస్ట్రేలియన్ ఓపెన్లో జరిగిన ఈ రసవత్తర కార్యక్రమంలో శనివారం అభిమానులు కనువిందు చేసుకున్నారు. సుదీర్ఘంగా సాగిన ఈ మ్యాచ్లో ప్రపంచ నంబర్వన్ హలెప్కు 76వ ర్యాంకర్ డేవిస్ చుక్కలు చూపించింది. తొలి సెట్ ఓడి, రెండో సెట్లో పుంజుకున్న హలెప్.. నిర్ణయాత్మక మూడో సెట్ గెలిచేందుకు ఏకంగా 2 గంటల 23 నిమిషాలు పోరాడాల్సి వచ్చింది. చివరికి ఈ మ్యాచ్ను హలెప్ 4-6, 6-4, 15-13తో సొంతం చేసుకుని ప్రిక్వార్టర్స్లో అడుగుపెట్టింది. తన ఒంట్లో కండరాలన్నీ దెబ్బ తిన్నట్లుందని తన పాదం ఉన్నట్లే అనిపించట్లేదంటూ దాదాపు చచ్చినంత పనైందంటూ విజయానంతరం హలెప్ వ్యాఖ్యానించడం విశేషం.
షరపోవా సరిపెట్టుకుంది:
మరోవైపు ఏడాదిన్నర నిషేధం పూర్తి చేసుకున్నాక తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడిన షరపోవా.. ప్రిక్వార్టర్స్ కూడా చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. మూడో రౌండ్లో ఆమె మాజీ నంబర్వన్, 21వ సీడ్ కెర్బర్ చేతిలో 1-6, 3-6తో చిత్తయింది. మహిళల సింగిల్స్లో మిగతా మూడో రౌండ్ మ్యాచ్ల్లో ఆరో సీడ్ స్లిస్కోవా (రష్యా) 7-6 (8-6), 7-5తో సఫరోవా (రష్యా)పై, 20వ సీడ్ స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) 6-2, 6-2తో పెరా (అమెరికా)పై, 8వ సీడ్ గార్సియా (ఫ్రాన్స్) 6-3, 5-7, 6-2తో సాస్నోవిచ్ (బెలారస్)పై విజయం సాధించారు. మాజీ నంబర్వన్ సీడ్ రద్వాంస్కా 2-6, 5-7తో సీ సు-వీ (తైవాన్) చేతిలో ఓడింది.
జకోవిచ్, రోజర్ల ముందంజ: రోజర్ ఫెదరర్ 20వ గ్రాండ్స్లామ్పై కన్నేసి పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్కు దూసుకెళ్లాడు. అతను ఫెదరర్ 6-2, 7-5, 6-4తో రిచర్డ్ గాస్కెట్ (ఫ్రాన్స్)పై విజయం సాధించాడు. గాస్కెట్పై 18-2తో ఉన్న ఘనమైన రికార్డును కొనసాగిస్తూ ఫెదరర్ మరోసారి ఆధిపత్యం చలాయించాడు. మ్యాచ్ మొత్తంలో మూడో సెట్లో ఒక్కసారి మాత్రమే సర్వీస్ కోల్పోయిన రోజర్.. ప్రత్యర్థి సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్లో అతడి విజయాల సంఖ్య 90కి చేరింది. ఫెదరర్ ఇక్కడ 13 మ్యాచ్లు ఓడాడు.
గాయం వల్ల ఆరు నెలలు ఆటకు దూరమైన ఈ టోర్నీతోనే పునరాగమనం చేసిన మాజీ నంబర్వన్ జకోవిచ్.. జోరు కొనసాగిస్తూ 6-2, 6-3, 6-2తో రామోస్ (ఆస్ట్రియా)పై నెగ్గి ప్రిక్వార్టర్స్లో అడుగుపెట్టాడు. 19వ సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్) 6-3, 6-3, 6-2తో 12వ సీడ్ డెల్పొట్రో (అర్జెంటీనా)ను ఓడించాడు. నాలుగో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ)కు షాక్ తగిలింది. అతను 7-5, 6-7 (3-7), 6-2, 3-6, 0-6తో అన్సీడెడ్, చంగ్ (కొరియా) చేతిలో పరాజయం చవిచూశాడు.ఐదో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) 6-4, 6-2, 7-5తో మనారినో (ఫ్రాన్స్)పై నెగ్గాడు.
భారత ఆటగాళ్లు: భారత స్టార్ ఆటగాడు లియాండర్ పేస్ పురవ్ రాజాతో కలిసి పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్లోకి దూసుకెళ్లాడు. హోరాహోరీగా సాగిన ప్రిక్వార్టర్స్లో ఈ జోడీ మ్యాచ్ పాయింట్ను కాచుకుని మరీ విజయం సాధించింది. పేస్-రాజా ద్వయం 7-6 (7-3), 5-7, 7-6 (8-6)తో జామీ ముర్రే (బ్రిటన్)-సోరెస్ (బ్రెజిల్) జంటపై విజయం సాధించింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.