హైదరాబాద్: గత ఏడాది సెప్టెంబరులో అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆమె ఆరు వారాల పాటు అసలు మంచంపై నుంచే లేవలేకపోయిందట.
తాజాగా 'వోగ్' మ్యాగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెరెనా తన డెలివరీ సమయంలో చోటు చేసుకున్న పలు ఆసక్తికర విషయాలను వివరించింది. గత ఏడాది సెప్టెంబరులో సెరెనాకు ఎమర్జెన్సీ సి-సెక్షన్ ద్వారా వైద్యులు ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు. అనంతరం ఆమెను గదికి తరలించారు.
.@serenawilliams and her daughter, Alexis Olympia Ohanian Jr., star on the cover of our February issue! Read the full interview: https://t.co/M3yiDQje6I pic.twitter.com/XLwLOLSsWJ
— Vogue Magazine (@voguemagazine) January 10, 2018
ఒకరోజు సెరెనాకు ఊపిరాడక పోవడంతో నోటితో శ్వాస తీసుకుంటూ గదిలో నుంచి బయటికి వచ్చి సీటీ స్కాన్ తీయాలని నర్సుకి చెప్పిందంట. దీంతో వెంటనే నర్సు తాను ఇచ్చిన నొప్పి మందు వల్ల అలా జరిగిందేమోనని భావించి అల్ట్రాసౌండ్ స్కాన్ తీస్తానని చెప్పి అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకుంది.
అయితే వెంటనే సెరెనా 'కడుపులో నొప్పి వల్ల కాదు.. నా శరీరంలో ఇంకేదో జరుగుతుంది సీటీ స్కానే తీయండి' అని మరోసారి నర్సును కోరింది. అయితే సెరెనా చెప్పిందేమీ వినిపించుకోకుండా వైద్యులు తొలుత అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి అందులో ఏమీ లేదని తేల్చారు.
ఆ తర్వాత సీటీ స్కాన్ నిర్వహించగా.. ఊపిరితిత్తుల్లో రక్తపు గడ్డలు ఉన్నట్లు తేలింది. అప్రమత్తమైన వైద్యులు వెంటనే ఆమెకు ఆపరేషన్ చేసిన ఆ రక్తపు గడ్డలను తొలగించేశారు. దీని తర్వాత సెరెనా సుమారు వారం పాటు ఆసుపత్రిలోనే గడిపింది. ఇంటికి వెళ్లినప్పటికీ తన బిడ్డ ఆలనాపాలనా మంచంపై నుంచే చూసుకుందట.
ఎందుకంటే సుమారు ఆరు వారాల పాటు ఆమె మంచానికి పరిమితమైంది కాబట్టి. రెడిడ్ సహ వ్యవస్థాపకుడు అలెక్స్ ఒహానియాన్తో గతేడాది జనవరిలో గర్భం దాల్చిన సెరెనా ఆ తర్వాత ఆటకు విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్కు తొలుత అందుబాటులో ఉంటానని చెప్పిన సెరెనా ఆ తర్వాత మళ్లీ తాను బరిలోకి దిగడం లేదంటూ ప్రకటన చేసింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.