హైదరాబాద్: మెటర్నటీ లీవ్ అనంతరం అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ ఆడబోతోన్న తొలి మేజర్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్. 23 సార్లు గ్రాండ్స్లామ్స్ గెలిచిన సెరెనాకు ఈ టోర్నీలో సీడింగ్ దక్కలేదు. వచ్చే ఆదివారం నుంచి మొదలుకానున్న ఈ క్లే కోర్టు గ్రాండ్స్లామ్లో సెరెనాకు సీడింగ్ ఇచ్చేందుకు నిర్వాహకులు అంగీకరించలేదు.
గతేడాది సెప్టెంబర్లో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత సెరెనా విలియమ్స్ ఈ ఏడాది రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఆమె పోటీ పడ్డ రెండు టోర్నీల్లో ఆరంభ రౌండ్లలోనే ఓడిపోయింది. ప్రస్తుతం సెరెనా విలియమ్స్ 453వ ర్యాంకులో కొనసాగుతోంది.
టోర్నీ నిబంధనల ప్రకారం తాజా డబ్ల్యూటీఏ ర్యాంకులకు అనుగుణంగానే ప్లేయర్లకు సీడింగ్ ఇవ్వాలని నిర్ణయించినట్టు నిర్వాహకులు మంగళవారం తెలిపారు. దీంతో సెరెనా తొలిరౌండ్లో డిఫెండింగ్ చాంపియన్ జెలెనా ఓస్తాపెంకోతో తలపడాల్సి ఉంటుంది.
అయితే, సెరెనా విలియమ్స్కు సీడింగ్ ఇవ్వకపోవడంపై ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకులు స్పందించేందుకు నిరాకరించారు. కాగా, ఫ్రెంచ్ ఓపెన్లో నిరాశ ఎదురైనా వింబుల్డన్ నిర్వాహకులు మాత్రం సెరెనా విలియమ్స్కు మద్దతుగా నిలిచారు.
సెరెనా గత ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటూ, ప్రత్యేక కారణాల రీత్యా ఆమెకు సీడింగ్ ఇవ్వాలని నిర్ణయించినట్టు ఆల్ ఇంగ్లండ్ క్లబ్ మంగళవారం స్పష్టం చేసింది. గతంలో సెరెనా విలియమ్స్ మూడు సార్లు వింబుల్డన్ విజేతగా నిలిచింది. ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీ జులై 2న మొదలుకానుంది.