హైదరాబాద్: 2018వ సంవత్సరం వింబుల్డన్ టెన్నిస్ టోర్నీకి మాజీ ఛాంపియన్ సెరెనా విలియమ్స్ 25వ సీడ్గా బరిలోకి దిగనుంది. డబ్ల్యుటీఏ ర్యాంకింగ్స్లో 32వ ర్యాంక్ లోపు లేకున్నా.. సెరెనాకు సీడింగ్ దక్కడం గమనార్శం. ఏడు సార్లు వింబుల్డన్ గెలిచిన సెరెనా గతేడాది సెప్టెంబర్లో తల్లి అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె ఇప్పటి వరకు కేవలం మూడు టోర్నీలను మాత్రమే ఆడింది. 23 గ్రాండ్స్లామ్లు గెలిచిన సెరీనా ప్రస్తుతం 183వ ర్యాంక్లో ఉన్నది.
మహిళల విభాగంలో సిమోనా హలెప్, పురుషుల విభాగంలో రోజర్ ఫెదరర్ టాప్ సీడ్గా వింబుల్డన్ బరిలోకి దిగనున్నారు. వీనస్ విలియమ్స్ ఈ టోర్నీలో 9వ సీడ్గా పోటీపడనుంది. ఈ క్రమంలో.. బ్రిటన్ ప్లేయర్ ఆండీ ముర్రేకు సీడింగ్ దక్కలేదు. కాగా, సెరీనాకు 25వ సీడింగ్ ఇవ్వడం పట్ల స్లోవేకియా ప్లేయర్ సిబుల్కోవా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. 'అసలు సీడెడ్గా బరిలోకి దిగడానికి సెరెనా కంటే నాకే ఎక్కువ అర్హత ఉంది. ఇంతకుముందు ఇలా జరిగిందో లేదో తెలీదు. సెరెనా నా కంటే వెనుకబడి ఉంది. అలాంటిది ఆమెను తీసుకొచ్చి నా ముందు నిలబడితే.. నా స్థానం ఇంకా వెనుకబడిపోతోంది. ఇది కచ్చితంగా నాకే దక్కితీరాల్సిన విషయం.' అని ఆమె ఉద్ఘాటించింది.
కానీ, వింబుల్డన్ కమిటీ సెరీనాకు సీడింగ్ ఇవ్వడాన్ని సమర్థించుకుంది. పైగా ఈ విషయంపై చక్కటి వివరణ ఇచ్చి తప్పించుకుంది. సెరీనాకు సీడింగ్ ఇవ్వడం వల్ల ఆమె మూడో రౌండ్ వరకు మరో సీడెడ్ ప్లేయర్తో తలపడే అవకాశం ఉండదు. పురుషుల టాప్ 5 సీడెడ్లుగా రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్, మారిన్ సిలిక్, అలెగ్జాండర్ జ్వెరెవ్, జువాన్ మార్టిన్ డెల్ పొట్రోలు ఉన్నారు.
అయితే మిగిలిన స్థానాల్లో సీడెడ్ గా ఎవరు దిగుతారనేంది పురుషుల విభాగంలోనూ ఎటూ తేలని ఉత్కంఠ అలానే ఉంది. కాగా, ఆండీ ముర్రే టోర్నీలో ఆడతాడనే విషయాన్ని వెలిబుచ్చడంలో వారం రోజుల పాటు ఆలస్యం చేశాడు. దీంతో అతను సీడెడ్గా బరిలోకి దిగే అవకాశల్లేవు.