న్యూయార్క్: ఈ నెలాఖరున ప్రారంభం కానున్న ప్రతిష్ఠాత్మక యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ కళ తప్పినట్టే కనిపిస్తోంది. అమెరికాకే చెందిన టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ ఈ మెగా టోర్నమెంట్ను తప్పుకొన్నారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. యూఎస్ ఓపెన్ నుంచి వైదొలగబోతోన్నట్లు తెలిపారు. యూఎస్ టోర్నమెంట్ నుంచి వైదొలగుతానని తాను కలలో కూడా ఊహించలేదని, అయినప్పటికీ.. ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు.
యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ ప్రారంభానికి ముందే తప్పుకోవడానికి గల కారణాలను ఆమె వివరించారు. కొంతకాలంగా సెరెనా విలియమ్స్ హ్యామ్స్ట్రింగ్ ఇంజ్యూరీతో బాధపడుతున్నారు. దీనికోసం ఆమె ఇదివరకే చికిత్స కూడా చేయించుకున్నారు. అయినప్పటికీ- పూర్తి ఫిట్నెస్ను సాధించలేకపోయారు. హ్యామ్స్ట్రింగ్ ఇంజ్యూరీ పూర్తిగా నయం తగ్గకపోవడం వల్ల ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
తన అభిమానులకు ఇది చేదు వార్తేనని, సుదీర్ఘమైన కేరీర్ను కొనసాగించాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నానని వివరణ ఇచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రపంచంలో తనకు ఇష్టమైన నగరం న్యూయార్కేనని, అక్కడ యూఎస్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్స్లామ్ ఆడటం కంటే ఇష్టమైన పని మరొకటి లేదని అన్నారు. టెన్నిస్లో ఇంకా సుదీర్ఘమైన ప్రయాణాన్ని సాగించాల్సి ఉందని, అందుకే ముందు జాగ్రత్త చర్యగా గ్రాండ్ స్లామ్ నుంచి తప్పుకొంటున్నానని చెప్పారు.
తన టీమ్తో అన్ని రకాలుగా చర్చించిన తరువాతే.. వైదొలగాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పారు. ఈ సంవత్సరం తాను యూఎస్ ఓపెన్ టెన్నిస్ స్టేడియానికి గైర్హాజర్ అవుతున్నానని, స్టాండ్స్లో ప్రేక్షకులను చూడలేకపోవడం బాధాకరమేనని.. తన అధికారిక ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన స్టేట్మెంట్లో స్పష్టం చేశారు. వింబుల్డన్ టోర్నమెంట్ నుంచి కూడా సెరెనా విలియమ్స్ అర్ధాంతరంగా తప్పుకొన్న విషయం తెలిసిందే. ఓపెనింగ్ మ్యాచ్ ఆడుతుండగానే హ్యామ్స్ట్రింగ్ ఇంజ్యురీ కావడంతో వైదొలిగారు.