హైదరాబాద్: వింబుల్డన్లో అమెరికన్ సిస్టర్స్ వీనస్, సెరెనా విలియమ్స్ రెండో రౌండ్లో అడుగుపెట్టారు. మరో అమెరికా తార స్లోన్ స్టీఫెన్స్ తొలి రౌండ్లోనే పరాజయానికి గురైంది. తల్లి అయిన తర్వాత తొలిసారి వింబుల్డన్ ఆడుతున్న సెరెనా 7-5, 6-3తో అరంటా రూస్ (నెదర్లాండ్స్)ను ఓడించింది. ఈ మ్యాచ్లో ఐదు ఏస్లు సంధించిన సెరెనా.. నాలుగుసార్లు ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసింది.
గేమ్ గెలిచిన తర్వాత సెరెనా మాట్లాడుతూ.. 'నేనిక్కడ వరకూ రాగలిగినందుకు సంతోషంగా ఉంది. తొలిసారి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మళ్లీ ఆడతానని అనుకోలేదు. మున్ముందు రౌండ్లలో ఇంకా నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తాను' అని తెలిపింది.
ఐదుసార్లు ఛాంపియన్ వీనస్ మరోవైపు తొలి రౌండ్ అధిగమించడానికి కొంచెం కష్టపడింది. ఆమె 6-7 (3-7), 6-2, 6-1తో లార్సన్ (స్వీడన్)పై గెలిచింది. నాలుగో సీడ్ స్లోన్ స్టీఫెన్స్ తొలి రౌండ్లోనే ఓడింది. అన్సీడెడ్ వికిచ్ (క్రొయేషియా) 6-1, 6-3తో స్టీఫెన్స్కు షాకిచ్చింది. రెండో సీడ్ వోజ్నియాకి 6-0, 6-3తో లెప్చెంకొ (అమెరికా) ఆట కట్టించగా.. అజరెంక (బెలారస్) 7-6 (7-4), 6-3తో అలెగ్జాండ్రోవా (రష్యా)ను ఓడించింది. మకరోవా (రష్యా) 7-6 (7-0), 2-6, 6-3తో మార్టిచ్ (క్రొయేషియా)పై గెలవగా.. ఏడోసీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 7-6 (7-2), 2-6, 6-1తో డార్ట్ (బ్రిటన్)పై కష్టపడి నెగ్గింది.
డిఫెండింగ్ ఛాంపియన్ రోజర్ ఫెదరర్ శుభారంభం చేశాడు. అతను అలవోకగా తొలి రౌండ్ దాటాడు. తొమ్మిదో సారి వింబుల్డన్ టైటిల్ సాధించే లక్ష్యంతో బరిలోకి దిగిన దిగ్గజ ఆటగాడు, టాప్ సీడ్ రోజర్ ఫెడరర్ రెండో రౌండ్లోకి అడుగు పెట్టాడు. టోర్నీ తొలి రోజు సోమవారం జరిగిన మొదటి రౌండ్ మ్యాచ్లో ఫెడరర్ 6-1, 6-3, 6-4తో డ్యుసాన్ లజోవిక్ (సెర్బియా)ను చిత్తు చేశాడు. కేవలం 79 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో వరల్డ్ నంబర్ 2 ముందు లజోవిక్ నిలవలేకపోయాడు.