మట్టిపై ఆడడం అంత సులువు కాదు:
తాజాగా సానియా మీర్జా మాట్లాడుతూ... 'కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా భయానక పరిస్థితి నెలకొంది. ఫ్రెంచ్ ఓపెన్ వాయిదాను అర్థం చేసుకోవచ్చు. కానీ.. ఒకసారి క్రీడాకారులతో మాట్లాడాల్సింది. సమాఖ్య నుంచి ఈమెయిల్ వచ్చింది. ట్విటర్లో చూసి కొందరు క్రీడాకారులతో మాట్లాడా. ట్విటర్ ద్వారానే వాయిదా సమాచారం తెలియడంపై అసహనం వ్యక్తం జేశారు. యుఎస్ ఓపెన్ ముగిసిన వారం రోజుల్లోనే ఫ్రెంచ్ ఓపెన్ ఎలా ఆరంభిస్తారో అర్థం కావట్లేదు. హార్డ్ కోర్టుపై ఆడిన వారం రోజులకే మట్టిపై ఆడడం అంత సులువు కాదు' అని పేర్కొంది.
అనవసరంగా 20 గంటలు ప్రయాణించా:
'శనివారం ఫెడ్ కప్ అవగానే నాన్నతో కలిసి ఇండియన్ వెల్స్కు బయల్దేరా. ఆదివారం కాలిఫోర్నియాకు చేరుకున్న గంట తర్వాత టోర్నీ రద్దయినట్లు క్రీడాకారులకు ఈమెయిల్ వచ్చింది. అనవసరంగా 20 గంటలు ప్రయాణించా. విషయం తెలిసి సోమవారం క్రీడాకారులంతా షాక్లో ఉన్నారు. ఏం చేయాలో ఎవరికీ అర్థంకాలేదు. అయితే కరోనా వ్యాప్తి కారణంగా ఇది సరైన నిర్ణయమే. కరోనా వైరస్ కారణంగా ప్రపంచమంతా అనిశ్చితి నెలకొంది' అని సానియా అంది.
కరోనా వైరస్ లక్షణాలు లేవు:
'కరోనా కారణంగా ప్రపంచమంతా అతలాకుతలం అవుతోంది. ఏం జరుగుతుందో ఎవరికీ తెలియట్లేదు. అదృష్టవశాత్తు నాకు, నాన్నకు కరోనా వైరస్ లక్షణాలు లేవు. ఇద్దరం సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాం. శాన్ డియాగో, హైదరాబాద్లో ఇంటి నుంచి బయటకి వెళ్లకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం. నేను తిరిగి రావడం ఇజ్హాన్కు ఎంతో సంతోషంగా ఉన్నాం. ఈ పరిస్థితుల్లో స్వీయ నిర్బంధం అంత సులువు కాదు' అని సానియా తెలిపింది.
యూఎస్ ఓపెన్ వాయిదా పడకపోతే:
మరోవైపు యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ సైతం వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ టెన్నిస్ సంఘం, ఏటీపీ, డబ్లూటీఏ నిర్వాహకులను సంప్రదించిన తర్వాతే కొత్త షెడ్యూలును నిర్ణయిస్తామని అమెరికా టెన్నిస్ సంఘం వెల్లడించింది. యూఎస్ ఓపెన్ను ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 13 వరకు నిర్వహించాల్సి ఉంది. ఒకవేళ యూఎస్ ఓపెన్ వాయిదా పడకపోతే.. రెండు టోర్నీ మధ్య ఉండే అంతరం కేవలం వారం రోజులే.