మెల్బోర్న్: ప్రస్తుత సీజన్ తర్వాత టెన్నిస్కు వీడ్కోలు పలుకుతానని ప్రకటించిన భారత స్టార్ సానియా మీర్జా ఇప్పుడు దానిపై పశ్చాత్తాప పడుతోంది. నిర్ణయం సరైనదే అయినా ప్రకటించిన సమయం సరైంది కాదని, ఈ విషయంలో తొందరపడినట్లుగా భావిస్తున్నానని ఆమె పేర్కొంది. ఈ సీజన్ తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి నిష్క్రమించిన తర్వాత ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించడం వల్ల తన ఆట గురించి కాకుండా భవిష్యత్తు గురించే ప్రశ్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
'ఇప్పుడు అంతా నా ఆట గురించి కాకుండా రిటైర్మెంట్ తర్వాతి విషయాలపైనే మాట్లాడుతున్నారు. దాని గురించే అడుగుతున్నారు. ఆఖరి సీజన్ అయినంత మాత్రాన నా ఆటలో, ఆలోచనా ధోరణిలో మార్పు ఉండదు. ప్రతీ మ్యాచ్ గెలవాలనే లక్ష్యంతోనే బరిలోకి దిగుతాను. ఆటను ఆస్వాదిస్తూనే గెలిచేందుకు 100 శాతం శ్రమిస్తాను. ఫలితం ఎలా వచ్చినా నా ప్రయత్నంలో లోపం ఉండదు. రిటైర్మెంట్ తర్వాతి అంశాల గురించి నేను అసలు ఆలోచించడమే లేదు. నిజాయితీగా చెప్పాలంటే రిటైర్మెంట్ గురించి నేను చాలా తొందరపడి ప్రకటన చేశాను. ఇప్పుడు దానికి పశ్చాత్తాపపడుతున్నా' అని 35 ఏళ్ల సానియా మీర్జా చెప్పుకొచ్చింది.
ఆస్ట్రేలియా ఓపెన్లో డబుల్, మిక్స్డ్ డబుల్లో బరిలోకి దిగిన సానియా మీర్జా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. అమెరికా టెన్నీస్ ప్లేయర్ రాజీవ్ రామ్తో కలిసి మిక్స్డ్ డబుల్స్లో బరిలోకి దిగిన హైదరాబాద్ స్టార్.. క్వార్టర్ ఫైనల్కే పరిమితమైంది. మంగళవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ఫైనల్లో అన్సీడెడ్ సానియా-రామ్ 4-6, 6-7 తేడాతో జాసోన్ కుబ్లర్, జమీ ఫోర్లిస్ ఆస్ట్రేలియా మిక్స్డ్ ద్వయం చేతిలో ఓటమిపాలైంది.
తొలి సెట్లో దారుణంగా విఫలమైన సానియా జోడీ.. రెండో సెట్లో పుంజుకున్నా పై చేయి సాధించలేకపోయింది. ఈ ఓటమి అనంతరమే రిటైర్మెంట్పై తొందరపడ్డానేమోనని సానియా పశ్చాత్తాపం వ్యక్తం చేసింది.
డబుల్స్లో ఉక్రెయిన్ ప్లేయర్ నదియా కిచ్నోక్తో జోడీ కట్టిన సానియా తొలి రౌండ్లోనే ఓటమిపాలైంది. స్లోవేనియాకు చెందిన తమరా జిదాన్సెక్-కాజా జువాన్ జోడీ 4-6, 6-7(5) చేతిలో సానియా ద్వయం ఓటమిపాలైంది. ఈ ఓటమి అనంతరం తనకు ఇదే చివరి సీజన్ అని, అనంతరం ఆటకు వీడ్కోలు పలుకుతానని ఈ హైదరాబాద్ స్టార్ ప్రకటించింది.