హైదరాబాద్: చైనా దేశంలోని వూహాన్ నగరంలో పుట్టిన కోవిడ్-19 (కరోనా వైరస్) మహమ్మారి ఎంతగా వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ వైరస్ ప్రభావం వలన ప్రపంచ దేశాలకు నిద్ర లేకుండా పోయింది. కరోనాతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 3,100 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. మరో 91,700 మందికి వైరస్ సోకింది. చైనాలో కొత్త కేసుల నమోదు గణనీయంగా తగ్గగా.. దక్షిణ కొరియా, ఇటలీ, ఇరాన్లలో విజృంభిస్తున్నది.
ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ప్రతీకారం.. వన్డే సిరీస్ కైవసం!!
భారత్, ఇండొనేషియా, థాయ్లాండ్లలో కొత్త కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో వైరస్ నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ఆగ్నేయాసియా దేశాలకు డబ్ల్యూహెచ్ఓ పలు సూచనలు చేసింది. ప్రజలు కరోనా వైరస్పై అవగాహన పెంచుకొని అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే పలువురు సెలెబ్రిటీలు సూచించారు. ఇక భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఓ వీడియో విడుదల చేశారు. కరోనా వైరస్పై అవగాహన పెంచుకొని అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
'దేశ ప్రజలందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. చైనా నుండి భయంకరమైన కరోనా వైరస్ అన్ని దేశాలకు వ్యాప్తి చెందుతుంది. అందరూ జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా చిన్న పిల్లలు. కరోనా వైరస్ లక్షణాలైన జలుబు, దగ్గు, జ్వరం లాంటివి కనిపిస్తే వెంటనే డాక్టరును సంప్రదించాలనికోరుతున్నా. కరోనా వైరస్పై సమాచారం కోసం హెల్ప్ లైన్ నంబరు 104 కు కాల్ చేయండి' అని సానియా మీర్జా తాను విడుదల చేసిన వీడియోలో కోరారు.
'కరోనా వైరస్ సోకకుండా అందరూ పరిశుభ్రత పాటించండి. ముందుజాగ్రత్తగా నిత్యం చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. కరోనా వైరస్ లక్షణాలుంటే.. 14 రోజుల పాటు ఐసోలేషన్ వార్డులో చేరి చికిత్స పొందాలి' అని సానియా సలహా ఇచ్చారు. దేశంలో ఇప్పటివరకు 28 మంది కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రకటించారు.