హైదరాబాద్: భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జాకు సమన్లు జారీ అయ్యాయి. సేవా పన్నులు సరిగా చెల్లించలేదంటూ సదరు అధికారులు ఆమెకు సమన్లు అందజేశారు. దీని విచారణ నిమిత్తం ఫిబ్రవరి 16న స్వయంగా సానియా మీర్జా లేదా ఆమె ప్రతినిధి కాని తమ ఎదుట హాజరు కావాలని సర్వీస్ ట్యాక్స్ అధికారులు ఆదేశించారు.
బ్రాండ్ అంబాసిడర్ హోదాలో తీసుకుంటున్న పారి తోషికానికి సేవా పన్ను చెల్లించాల్సిందేనని సర్వీస్ ట్యాక్స్ విభాగం స్పష్టం చేసింది. సానియా మీర్జా ఏటా రూ. కోటి పారితోషికం తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగుతున్నారు. ఈ విషయాన్ని గతంలో ప్రభుత్వమే ప్రకటించింది.
ఈ తరహాలో నగదు తీసుకుంటూ చేస్తున్న సేవ వాణిజ్య వ్యవహారం కిందికే వస్తుందని సర్వీస్ ట్యాక్స్ అధికారులు గుర్తించారు. దీంతో ఆ పారితోషికం మొత్తంపై ఏటా 15 శాతం పన్ను చెల్లించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు ఆమెకు మంగళవారం సమన్లు జారీ చేసిన అధికారులు ఈ నెల 16న విచారణకు హాజరుకావాలని స్పష్టం చేశారు.
రెడ్ హిల్స్లోని సర్వీస్ ట్యాక్స్ విభాగపు అధికారులు ఫిబ్రవరి 6వ తేదీన ఆమెకు సమన్లు జారీ చేశారు. తాము అందించిన సమన్లుపై స్పందించి తగిన పత్రాలు ఇవ్వనట్లయితే 1994 ఆర్థిక చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.