న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ల 12 ఏళ్ల వివాహ బంధానికి తెరపడిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకున్న ఈ జోడీ విడాకులు తీసుకుంటుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. గత కొద్ది రోజులుగా ఈ ఇద్దరి మధ్య సఖ్యత లేదని, సంసారం సాఫీగా సాగడం లేదని తెలుస్తోంది. ఇటీవల సానియా మీర్జా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్ట్లు ఈ వార్తలకు బలం చేకూర్చుతోంది.
సానియా మీర్జా ఇటీవలే ట్విటర్ వేదికగా కొడుకు ఇజాన్తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసింది. దీనికి తాను కష్టతరమైన సమయాల్లో తీసుకున్న క్షణాలు అంటూ క్యాప్షన్గా పేర్కొంది. అంతకుముందు పోస్ట్లో విరిగిన హృదయాలు ఎక్కడికి వెళ్తాయి..? అని ఏదో బాధలో ఉన్నట్లు పేర్కొంది. దాంతో సానియా సంసారంలో ఏదో జరుగుతుందని నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారని.. వీడిపోవాలని నిర్ణయం తీసుకున్నారని కామెంట్ చేస్తున్నారు.
మరోవైపు షోయబ్ మాలిక్-సానియా మీర్జా తమ కుమారుడు ఇజాన్ పుట్టినరోజు వేడుకలను దుబాయ్లో ఘనంగా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను మాలిక్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అయితే సానియా మీర్జా ఒక్క ఫోటో కూడా షేర్ చేయలేదు. దీంతో ఇద్దరి మధ్య సంబంధం బాగా లేదంటూ ఊహగానాలు వెలువడుతున్నాయి. వీరి విడాకుల గురించి సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చ జరుగుతున్నప్పటికీ ఇటు సానియా కానీ.. అటు షోయబ్ మాలిక్ గానీ స్పందించలేదు. దాంతో ఈ ఇద్దరూ విడిపోవడం ఖాయమనే అభిప్రాయం వెలవడుతోంది.
2010లో ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి చేసుకున్న ఈ స్టార్ కపుల్స్.. ఎన్నో విమర్శల నడుమ దేశం సరిహద్దులు చేరిపేస్తూ.. తమ వైవాహిక జీవితాన్ని ప్రారంభించారు. వీరికి 2018లో ఇజాన్ మీర్జా మాలిక్ పుట్టాడు. అయితే షోయబ్ మాలిక్ను పెళ్లి చేసుకున్న కారణంగా సానియా మీర్జా తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ముఖ్యంగా భారత్-పాక్ మధ్య మ్యాచ్లు జరిగినప్పుడు అభిమానులకు ఆమె టార్గెట్ అయ్యేది.