హైదరాబాద్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా త్వరలోనే బుల్లితెరపై సందడి చేయనున్నారు. ఆటతో పాటు అందం కలబోసిన సానియా మొట్టమొదటిసారి ఓ వెబ్ సిరీస్లో నటించబోతున్నారు. టీబీపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ సిరీస్ను తెరకెక్కిస్తున్నారు. సానియాను ఎప్పటి నుంచో సినిమాల్లో నటింపజేయాలని చాలామంది ప్రయత్నించి విఫలమయ్యారు. అయితే ప్రజల్లో టీబీపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ సిరీస్ను తెరకెక్కిస్తున్నారు కాబట్టి ఆమె గ్రీన్సిగ్నల్ ఇచ్చారు.
'నిషేధ్ ఎలోన్ టుగెదర్' వెబ్ సిరీస్లో సానియా మీర్జా నటించనున్నారు. మొత్తం ఐదు ఎపిసోడ్స్గా సాగే ఈ సిరీస్ నవంబర్ చివరలో ఎంటీవీలో ప్రసారం కానుంది. టీబీపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ సిరీస్ను తెరకెక్కిస్తున్నారు. ఈ సిరీస్లో సానియా మీర్జాగానే ఆమె కనిపించనున్నారట. త్వరలోనే షూటింగ్ మొదలు కానుందట. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అన్ని జాగ్రత్తల నడుమ షూటింగ్ జరగనుందని తెలుస్తోంది.
సానియా మీర్జా మాట్లాడుతూ... 'భారత్లో టీబీ కారణంగా ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ మహ్మరి బారినపడ్డ వారిలో సగానిపైగా 30 ఏళ్లలోపు వారే ఉన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో టీబీ తీవ్ర ప్రభావం చూపుతూ మనుషుల ప్రాణాలు తీస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో దాని చుట్టూ ఉన్న అవాస్తవాలను పరిష్కరించడానికి, అవగాహన కల్పించటానికి, ప్రజల్లో మార్పును తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో చైతన్యం కలిగించే సబ్జెక్ట్ కావడంతోనే ఈ వెబ్ సిరీస్లో నటించేందుకు ఒప్పుకున్నా' అని తెలిపారు.
సానియా మీర్జా గత ఆదివారం 34వ పడిలోకి అడుగుపెట్టారు. జన్మదిన వేడుకలను భర్త షోయబ్ మాలిక్, కుమారుడు ఇజాన్లతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. కరోనా కారణంగా ప్రస్తుతం ఎటువంటి టెన్నిస్ టోర్నీలు జరగకపోవడంతో భర్తతో కలిసి యూఏఈలో ఉన్నారు. సానియా, మాలిక్ల వివాహం 2010 ఏప్రిల్ 12న జరిగింది. హైదరాబాద్లో సంప్రదాయ పద్దతిలో మాలిక్ను సానియా వివాహం చేసుకున్నారు. వీరికి 2018లో ఓ కుమారుడు జన్మించాడు.
India vs Australia: పెరిగిన కరోనా కేసులు.. తొలి టెస్ట్ డౌటే.. సిరీస్ కూడా అనుమానమే?