హైదరాబాద్: లండన్ వేదికగా జరిగిన ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్లో స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ విజయం సాధించాడు. ఈ టోర్నీలో ఫెదరర్కు ఇది వరుసగా మూడో విజయం కావడం విశేషం. గురువారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో ఫెదరర్ 6-7 (5/7), 6-4, 6-1తో మారిన్ సిలిచ్ (క్రొయేషియా)పై విజయం సాధించాడు.
దీంతో బోరిస్ బెకర్ గ్రూప్లో అగ్రస్ధానంలో నిలిచాడు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ తొలి సెట్లో ఫెదరర్ మూడు బ్రేక్ పాయింట్లను సద్వినియోగం చేసుకున్నాడు. టైబ్రేక్లో 5-5తో ఉన్న దశలో అద్భుతమైన బ్యాక్హ్యాండ్ వ్యాలీతో సెట్ను చేజిక్కించుకున్నాడు. రెండోసెట్లో సిలిచ్ పుంజుకున్నట్లు కనిపించినా ఫెదరర్ అద్భుత ప్రదర్శన ముందు చిన్నబోయాడు.
చివరకు పదో గేమ్లో సిలిచ్ సర్వీస్ను బ్రేక్ చేసి 2-0 ఆధిక్యంలోకి వెళ్లాడు. ఇక మూడో సెట్లో మూడుసార్లు సర్వీస్ను నిలబెట్టుకుని సెట్తో పాటు మ్యాచ్ను చేజిక్కించుకున్నాడు. తాజా విజయంతో ఫెదరర్ 110,235,682 డాలర్ల (దాదాపు 720 కోట్లు) ప్రైజ్ మనీ అందుకుని ప్రపంచంలో అత్యధికంగా సంపాదిస్తున్న అథ్లెట్గా రికార్డు సాధించాడు.
ఈ జాబితాలో ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న గోల్ప్ ఆటగాడు టైగర్ ఉడ్స్ రెండో స్థానానికి పరిమితమయ్యాడు. టైగర్ ఉడ్స్ తన కెరీర్లో 110,061,012 డాలర్ల ప్రైజ్ మనీ అందుకున్నాడు. 19 గ్రాండ్స్లామ్ టైటిళ్లను కొల్లగొట్టిన 36 ఏళ్ల ఫెదరర్ ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్ సహా మొత్తం ఏడు టైటిళ్లు సాధించాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.