హైదరాబాద్: రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్, నొవాక్ జకోవిచ్, ఆండీ ముర్రే.. దశాబ్దంన్నరగా పురుషుల టెన్నిస్ను శాసిస్తున్న చతుష్టయం. ఈ నలుగురూ మంచి ఫామ్లో ఉండి బరిలోకి దిగితే టెన్నిస్ ప్రియులకు కనువిందే. కొన్నేళ్లుగా గాయాలు, ఫామ్ లేమి, ఇతర సమస్యలతో ఈ నలుగురిలో ఎవరో ఒకరు గ్రాండ్స్లామ్ టోర్నీలకు దూరం కావడం, ఆరంభ రౌండ్లలోనే వెనుదిరగడంతో అభిమానులు మజా కోల్పోతున్నారు.
చాన్నాళ్ల తర్వాత ఈ నలుగురూ కలిసి పూర్తి ఫిట్నెస్, చక్కటి ఫామ్తో బరిలోకి నిలుస్తున్న టోర్నీ యుఎస్ ఓపెన్. ఫెదరర్, నాదల్ రెండేళ్ల నుంచి మంచి ఫామ్లో కొనసాగుతుండగా.. జకోవిచ్ పేలవ ఫామ్ను అధిగమించి వింబుల్డన్ విజయంతో సత్తా చాటాడు. ముర్రే గాయం నుంచి కోలుకుని ఇటీవలే మైదానంలోకి అడుగుపెట్టి ఫామ్ అందుకున్నాడు. సోమవారం ఆరంభమయ్యే యుఎస్ ఓపెన్కు వీరి ఆటే ప్రధాన ఆకర్షణ అవుతుందనడంలో సందేహం లేదు.
సోమవారంతో మొదలుకానున్న యూఎస్ ఓపెన్ టోర్నీ గురించి ఐదు సార్లు ట్రోఫీ విజేతగా నిలిచిన ఫెదరర్ మాట్లాడుతూ.. తానిప్పటికీ ఆ పాత ఆటనే కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. చాలా టోర్నీల నుంచి తాను మ్యాచ్లలో ఓడిపోకుండా గెలుస్తుండటంపై విశ్వాసం వ్యక్తం చేశాడు.
ప్రపంచ నెంబర్ 2 జకోవిచ్ మాట్లాడుతూ.. టోర్నీని బట్టి ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం మెరుగుపడాలి. ఆటపై ఏకాగ్రత.. ఆటలో తీవ్రతను నిశితంగా పరిశీలించే గుణం మెరుగవ్వాలి. ఇలాంటి టోర్నీల్లో ఆడాలంటే వాటన్నిటికీ సన్నద్ధం అయి ఉంటేనే కుదురుతుంది' అని పేర్కొన్నాడు. మరోవైపు మహిళల సింగిల్స్లో అందరి చూపూ సెరెనా విలియమ్స్ మీదే. మార్గరెట్ కోర్ట్ పేరిట ఉన్న అత్యధిక గ్రాండ్స్లామ్ల రికార్డు (24) అందుకోవడానికి సెరెనా ఒక టైటిల్ దూరంలో ఉంది.