లండన్: కరోనా దెబ్బకు అస్తవ్యస్తమైన టెన్నిస్ క్యాలెండర్ను ఏటీపీ ఇటీవల రీషెడ్యూల్ చేసింది. ఐదు నెలల విరామం తర్వాత యూఎస్ ఓపెన్ ద్వారా టెన్నిస్ పోటీలకు తెర లేవనుంది. అయితే ఈ రీ షెడ్యూల్ ఆటగాళ్లకు సమస్యగా మారింది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 13 వరకు యూఎస్ ఓపెన్ జరుగబోతుండగా.. 15రోజుల అనంతరం క్లే కోర్టులపై ఫ్రెంచ్ ఓపెన్కు సిద్ధం కావాల్సి ఉంటుంది. ఈ మధ్యలో మాడ్రిడ్, రోమ్లలో మాస్టర్ ఈవెంట్స్ జరుగుతాయి. అందుకే ఆరు వారాల వ్యవధిలోనే వరుసగా నాలుగు టోర్నీలు ఆడాల్సి రావడంపై స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ అసంతృప్తిగా ఉన్నాడని అతని మామ, మాజీ కోచ్ టోనీ వెల్లడించాడు.
'నేను నాదల్తో మాట్లాడా. అతను ఏ టోర్నీలో ఆడాలో తేల్చుకోలేకపోతున్నాడు. కొత్త షెడ్యూల్ వల్ల వెటరన్ ప్లేయర్లకు సమస్యలు తప్పవు. వారాల తరబడి పోరాడడానికి శరీరం సహకరించదు. ఏటీపీ తప్పుడు నిర్ణయం తీసుకుందనే చెప్పాలి. ముఖ్యంగా నాదల్, జొకోవిచ్ వంటి ప్లేయర్లకు నష్టం కలిగించేలా నిర్ణయం తీసుకుంది'అని టోనీ పేర్కొన్నాడు. మరోపక్క ఇంత తక్కువ టైమ్లో వేర్వేరు భూభాగాల్లో ఆడడం ప్లేయర్లకు సురక్షితం కాదని ఆండీ ముర్రే అన్నాడు.
'కొంతకాలంగా ప్లేయర్లు ఆటకు దూరంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో న్యూయార్క్లో కనీసం క్వార్టర్ ఫైనల్కు చేరిన ఆటగాళ్లు వెంటనే మాడ్రిడ్లో క్లే కోర్ట్లో బరిలోకి దిగాలి. ఇది ఎంత మాత్రం సురక్షితం కాదు'అని ముర్రే పేర్కొన్నాడు.