మూడోరౌండ్లోకి అడుగుపెట్టిన ముగురుజా
మరోవైపు మహిళల సింగిల్స్లో రెండో ఫ్రెంచ్ టైటిల్ కోసం వేట మొదలుపెట్టిన మాజీ చాంపియన్, మూడో సీడ్ గాబ్రియేల్ ముగురుజా మరో అడుగు ముందుకేసింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండోరౌండ్లో మూడోసీడ్ ముగురుజా 6-4, 6-3తో ఫియోనా ఫెర్రో (ఫ్రాన్స్)పై గెలిచి మూడోరౌండ్లోకి అడుగుపెట్టింది. గంటా 26 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో ముగురుజా బేస్లైన్ గేమ్తో అదురగొట్టింది. నాలుగు ఏస్లు సంధించిన ముగురుజా రెండు డబుల్ ఫాల్ట్లు చేయగా 5 బ్రేక్ పాయింట్లను కాచుకుంది.
షరపోవాకు గట్టి పోటీ
మరోవైపు మరియా షరపోవాకు గట్టి పోటీ ఎదురైంది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో 7-5, 6-4 తేడాతో డోనా వెకిక్ (క్రొయేషియా)పై విజయం సాధించింది. చివరి సెట్ను గెలిచేందుకు షరపోవా ఐదో మ్యాచ్ పాయింట్ వరకు ఎదురుచూడాల్సి వచ్చింది. ఇక చెక్ రిపబ్లిక్ బ్యూటీ కరోలినా ప్లిస్కోవా 3-6, 6-4, 6-1 తేడాతో తన దేశానికే చెందిన లూసీ సఫరోవాపై గెలిచి షరపోవాతో పోరుకు సిద్ధమైంది. ఇతర మ్యాచ్ల్లో ఫ్లిస్కోవా (చెక్) 3-6, 6-4, 6-1తో సఫరోవా (చెక్)పై, షరపోవా (రష్యా) 7-5, 6-4తో వికిచ్ (క్రొయేషియా)పై, కెర్బర్ (జర్మనీ) 6-2, 6-3తో బోగ్దాన్ (రొమేనియా)పై, మార్టినెస్ (బెల్జియం) 6-3, 6-4తో వాట్సన్ (బ్రిటన్)పై, సురెంకో (ఉక్రెయిన్) 6-3, 4-6, 6-0తో వాండ్వాఘే (అమెరికా) పై, స్టోసుర్ 6-2, 7-6 (7/1)తో పావులుంచెకోపై, గవిరోలోవా 5-7, 7-5, 6-3తో పెరాపై, రెబెరికోవా 6-2, 6-4తో బెనిచ్పై, బెర్టెన్స్ 6-4, 6-2తో సన్సోవిచ్పై, పెట్కోవిచ్ 6-0, 7-6 (7/5)తో మాటెక్ సాండ్పై నెగ్గి మూడోరౌండ్లోకి ప్రవేశించారు.
మూడోరౌండ్లోకి దూసుకెళ్లిన నాదల్
పురుషుల సింగిల్స్ రెండోరౌండ్లో టాప్సీడ్ నాదల్ (స్పెయిన్) 6-2, 6-1, 6-1తో గుడియో పెల్లా (అర్జెంటీనా)పై గెలిచి మూడోరౌండ్లోకి దూసుకెళ్లాడు. రెండు గంటల 3 నిమిషాల మ్యాచ్లో పెల్లా కేవలం నాలుగు గేమ్లను మాత్రమే కాపాడుకోగలిగాడు. ప్రత్యర్థి ఎనిమిది ఏస్లు సంధించినా ఒక్క బ్రేక్పాయింట్ను సాధించలేకపోయాడు. తొలిసెట్లో నాలుగు బ్రేక్ పాయింట్లను కాచుకున్న స్పెయిన్ బుల్ వరుసగా 9 గేమ్లను గెలిచాడు. మ్యాచ్ మొత్తం సాధారణమైన సర్వీస్లనే కొట్టిన నాదల్.. చివరి రెండు సెట్లలో మాత్రం మరింత దూకుడుగా ఆడాడు.
రెండో రౌండ్లో యుకీ-శరణ్ జోడీ
పురుషుల డబుల్స్లో భారత క్రీడాకారులు మెరుగైన ప్రదర్శన చూపెడుతున్నారు. గురువారం జరిగిన రెండోరౌండ్లో 13వ సీడ్ బోపన్న-రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) 6-1, 6-2తో బెంజిమెన్ బోంజి-జార్జ్ జాక్ (ఫ్రాన్స్)పై గెలిచి మూడోరౌండ్లోకి ప్రవేశించారు. 48 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో ఇండో-ఫ్రాన్స్ జంట 4 ఏస్లతో చెలరేగింది. మ్యాచ్మొత్తంలో ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయకపోవడం విశేషం. అంతకుముందు జరిగిన తొలిరౌండ్లో భారత డబుల్స్ జంట యుకీ భాంబ్రీ-దివిజ్ శరణ్ జోడీ 6-3, 5-7, 6-4 తేడాతో పూరవ్ రాజా (భారత్)-ఫ్యాబ్రిక్ మార్టిన్ (ఫ్రాన్స్)పై విజయం సాధించి రెండో రౌండ్లోకి అడుగుపెట్టారు.