
న్యూయార్క్: తన చేతిలో గాయపడిన మహిళా లైన్జడ్జిపై ఎదురుదాడికి దిగడం ఆపాలని ప్రపంచ నెంబర్ వన్, సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ తన అభిమానులను కోరాడు. ప్రీ క్వార్టర్స్లో జకోవిచ్ పొరపాటున కొట్టిన బంతి ఆమె గొంతుకు తగలడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ ఘటనతో జకోవిచ్ ఏకంగా టోర్నీ నుంచే బహిష్కరణకు గురయ్యాడు. అయితే ఆ తర్వాత ఈ నెంబర్ వన్ ప్లేయర్ అభిమానులు సోషల్ మీడియాలో లైన్జడ్జిని ట్రోలింగ్ చేస్తూ విమర్శలు గుప్పించారు. చిన్న దెబ్బకే విలవిల్లాడినట్టు ఓవరాక్షన్ చేసిందని ఆరోపించారు. తన ఓవరాక్షన్ వల్ల జకోవిచ్ అనర్హతకు గురి కావాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే ఇందులో ఆమె తప్పేమీ లేదని, దయచేసి ట్రోలింగ్ ఆపాలని జకోవిచ్ ట్విటర్ వేదికగా అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. 'సానుకూల సందేశాలతో నాకు అండగా నిలిచిన మీ అందరికి ధన్యవాదాలు. బంతి తగిలి గాయపడ్డ లైన్ అంపైర్కు మన మద్దతు అవసరమనే విషయాన్ని దయచేసి మీరందరు గ్రహించాలి. ఈ ఘటనలో ఆమె తప్పు ఏం లేదు. ఈ కఠిన పరిస్థితుల్లో ఆమెకు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇలా విపత్కర పరిస్థితులు మనల్ని ఇంకా దృడంగా మారుస్తాయి. అందరికి మీ ప్రేమను పంచండి. యూరోపియన్ ఓపెన్లు కలుద్దాం'అంటూ ట్వీట్ చేశాడు.
స్పెయిన్కు చెందిన పాబ్లో కారెనో బస్టాతో ఇక గత ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్ ఫైనల్లో సహనం కోల్పోయిన జకోవిచ్ బంతిని బలంగా వెనక్కి కొట్టాడు. ఈ గేమ్లో ఓపెనింగ్ సెట్ కోల్పోయిన సెర్బియా స్టార్.. 5-6తో వెనుకబడి సర్వీస్ను చేజార్చుకున్నాడు. దీంతో తీవ్ర అసహనానికి గురైన ఈ వరల్డ్ నెంబర్ వన్ ఆటగాడు వెనక్కు తిరిగి బంతిని బలంగా కొట్టాడు. అయితే అక్కడే లైన్ జడ్జ్ ఉండటంతో ఆమెకు బంతి బలంగా తాకడంతో కుప్పకూలింది. వెంటనే తన తప్పును తెలుసుకున్న జకోవిచ్.. ఆమెకు క్షమాపణలు కూడా చెప్పాడు. ఉద్దేశపూర్వకంగా కొట్టలేదని జకోవిచ్ వాదించినప్పటికీ.. నిబంధనల ప్రకారం టోర్నీ నిర్వాహకులు అతన్ని డిస్ క్వాలిఫై చేశారు.