బెల్గ్రేడ్: ప్రపంచ నంబర్వన్ టెన్నిస్ ఆటగాడు, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్కు కరోనా నెగటివ్ వచ్చింది. తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో జొకోవిచ్తో పాటు అతని భార్య జెలీనాకు కూడా నెగటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయన మీడియా బృందం గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. 10 రోజుల తర్వాత నెగటివ్ రావడంతో జొకోవిచ్ కుటుంబ సభ్యులతో పాటు అతడి ఫాన్స్ ఆనందం వ్యక్తం చేసారు.
నొవాక్ జొకోవిచ్, అతడి సోదరుడు ఆధ్వర్యంలో గత నెలలో అడ్రియా టూర్ ఎగ్జిబిషన్ టోర్నీ జరిగిన విషయం తెలిసిందే. టోర్నమెంట్ మొత్తం దగ్గరుండి జొకోవిచ్ చూసుకున్నాడు. సెర్బియా రాజధానిలో తొలి దశ టూర్ ముగియగా ఆ తర్వాత రెండో దశ పర్యటన జదార్లో జరిగింది. సెర్బియా అంచె పోటీలు ముగిశాక.. క్రొయేషియాలో రెండో అంచె పోటీలు నిర్వహిస్తుండగా ఆటగాళ్లు, సహాయ సిబ్బంది కోవిడ్ బారిన పడ్డారు. దీంతో ఫైనల్ మ్యాచ్ను రద్దు చేశారు. అప్పటికే ముగ్గురు టాప్ ప్లేయర్లు గ్రిగోర్ దిమిత్రోవ్ (బల్గేరియా), బోర్నా కోరిచ్ (క్రొయేషియా), విక్టొర్ ట్రయోకీ (సెర్బియా)లకు కరోనా నెగటివ్ అని తేలింది.
ఆ తర్వాత అడ్రియా టూర్ నిర్వాహకుడు, ఆటగాడు జొకోవిచ్కు వైరస్ సోకింది. జొకోవిచ్తో పాటు అతని భార్య జెలీనాకు పాజిటివ్ అని తేలింది. దీంతో బెల్గ్రేడ్లోని ఇంట్లో జొకోవిచ్, జెలీనాలు స్వీయ నిర్బంధంలో ఉన్నారు. గత 10 రోజులుగా వైద్యుల సమక్షంలో కోలుకున్నారు. తాజాగా ఇద్దరికీ టెస్టులు చేయగా.. కరోనా పాజిటివ్ అని తేలింది. మరో ముగ్గురు ఆటగాళ్లు కూడా కోలుకుంటున్నారు. తాజాగా క్రొయేషియా టెన్నిస్ దిగ్గజం, మాజీ వింబుల్డన్ ఛాంపియన్, జొకోవిచ్ కోచ్ అయిన గొరాన్ ఇవానిసెవిచ్ కూడా కరోనా బారిన పడ్డాడు. కరోనా లక్షణాలు లేకపోయినా అతడు వైరస్ బారిన పడ్డాడు.
వైరస్ వ్యాప్తిని నిర్లక్ష్యం చేస్తూ.. ఎలాంటి జాగ్రత్తలు, నిబంధనలు పాటించకుండా ఆటగాళ్లకు వైరస్ సోకడంలో జొకో పరోక్షంగా కారకుడయ్యాడంటూ అంతా దుమ్మెత్తిపోస్తున్నారు. వైరస్ విజృంభిస్తున్న సమయంలో ఆటగాళ్లు భౌతిక దూరం పాటించకుండా డ్యాన్స్లు వేయడం, పార్టీలు చేసుకొనే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఎక్కువ మంది కొవిడ్ బారినపడ్డారు. దీనిపై జొకో క్షమాపణలు కూడా కోరాడు. అయితే క్రొయేషియాలోని స్లిపట్ నగరంలో కరోనా అంటించిన జొకోవిచ్ చావాలని కోరుకుంటున్నట్లు కొందరు నిరసనకారులు గోడలపై రాతలు రాశారు.
జొకోవిచ్కు సెర్బియా ప్రధాని అనా బోర్నబిచ్ మద్దతుగా నిలిచారు. ఈ పరిస్థితుల్లో దేశంలో టోర్నీల నిర్వహణకు అనుమతించిన తనది తప్పని.. జొకోది కాదన్నారు. ఈ నేపథ్యంలో నొవాక్ను ఒంటరిగా వదిలేయమని అనా అన్నారు. 'అతడు మంచి చేయాలని చూశాడు. మానవతా దృక్పథంతో కొవిడ్ బాధితుల కోసం విరాళాలు సేకరించాలనుకున్నాడు. ఎదైనా తప్పు జరిగితే అది నావల్లే. జొకోను వదిలేయండి' అని అనా బోర్నబిచ్ విజ్ఞప్తి చేశారు.
పీవీ సింధుతో ఇంటరాక్టివ్ సెషన్.. ఎందుకంటే?!!