సిసినాటి: ఫెదరర్కు మరోసారి షాక్ ఇచ్చాడు. టెన్నిస్ స్టార్ ఫెదరర్ను ఓడించి ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ టైటిల్ను సొంతం చేసుకున్న ఈ సెర్బియా యోధుడు మరో సారి అదే ఫలితాన్ని పునరావృతం చేశాడు. పురుషుల సింగిల్స్లో జకోవిచ్ విజేతగా నిలిచాడు. రెండేళ్లుగా గాయాలు, ఫామ్లేమితో ఇబ్బందిపడుతూ వైఫల్యాలు చవిచూస్తున్న జకోవిచ్.. గ్రాండ్స్లామ్ టైటిల్ అందుకున్న జోరులో మరో విజయాన్ని దక్కించుకున్నాడు.
వింబుల్డన్ ఛాంపియన్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) తన కెరీర్లో.. సిన్సినాటి ఓపెన్ టెన్నిస్ టోర్నీని తొలిసారి సొంతం చేసుకున్నాడు. సోమవారం పురుషుల సింగిల్స్ ఫైనల్లో జకో 6-4, 6-4 తేడాతో స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్పై విజయం సాధించాడు. దాంతో అన్ని (తొమ్మిది) ఏటీపీ మాస్టర్స్ 1000 సిరీస్ టెన్నిస్ టోర్నీలు గెలిచిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ గెలుపుతో ఫెదరర్పై విజయాల సంఖ్యను 24-22కు పెంచుకున్నాడు.
'కల నిజమైంది. ఆరుసార్లు ఫైనల్ చేరిన తర్వాత చివరకు సిన్సినాటి ఓపెన్లో విజేతగా నిలిచా. అది కూడా దిగ్గజం ఫెదరర్పై గెలవడం ఆనందంగా ఉంది'' అని జకో తెలిపాడు. ''నొవాక్ గొప్ప ఛాంపియన్. ఈ విజయంతో అతను చరిత్ర సృష్టించాడు' అని ఫెదరర్ పేర్కొన్నాడు.
మహిళల సింగిల్స్లోనూ సంచలనం నమోదైంది. ప్రపంచ నంబర్వన్ సిమోనా హలెప్కు షాకిస్తూ బెర్టిన్స్ టైటిల్ ఎగరేసుకుపోయింది. ఫైనల్లో బెర్టిన్స్ 2-6, 7-6 (8-6), 6-2 తేడాతో హలెప్పై విజయం సాధించింది.