సెర్బీయా: కరోనా వైరస్ మహమ్మారి ప్రతిఒక్కరిని బాగా ఇబ్బందిపెట్టింది. చిన్నా, పెద్ద, పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలపై ఈ మహమ్మారి తన ప్రభావం చూపింది. బాధితుల్లో నంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు నోవాక్ జకోవిచ్ కూడా ఉన్నాడు. లాక్డౌన్ కారణంగా రెండు నెలలు స్పెయిన్లో చిక్కుకుపోయిన జాకో.. చివరకు స్వదేశం సెర్బీయాకు చేరుకున్నాడు.
ధోనీ నుంచి వార్నింగ్ వచ్చేది.. ఓ రెండు అవకాశాలివ్వవా అని కోరేవాడిని: రైనా
స్పెయిన్లో ఉన్న తన సోదురుడిని చూసేందుకు కుటుంబంతో సహా జకోవిచ్ మార్చిలో అక్కడి వెళ్ళాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు స్పెయిన్లో లాక్డౌన్ విధించడంతో జాకో అక్కడే ఉండిపోయాడు. కొన్ని సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో.. జకోవిచ్ ఎట్టకేలకు మాతృదేశం సెర్బీయాకు చేరుకున్నాడు. సెర్బియా చేరుకోగానే.. తన టెన్నిస్ కాంప్లెక్స్లో మీడియాతో జకోవిచ్ మాట్లాడాడు.
'లాక్డౌన్ సమయంలో స్పెయిన్లో ఉన్నా. అందరం అక్కడే ఉన్నాం కాబట్టి కుటుంబంతో గడిపా. ప్రస్తుతం ఫిట్గానే ఉన్నా. ప్రతీ రోజూ టెన్నిస్ కోర్టులో ప్రాక్టీస్ చేశా. ఈ విరామ సమయంలో నా సాధనకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. మేము ఉన్న మార్బెల్లా రిసార్ట్లో టెన్నిస్ కోర్టు ఉంది. అందులో చక్కగా ప్రాక్టీస్ చేశా' అని నోవాక్ జకోవిచ్ తెలిపాడు. తన ప్రాక్టీస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోడానికి ఇష్టపడలేదని, అలా చేసి ఇతరులను ఇబ్బంది పెట్టదల్చుకోలేనని జకోవిచ్ పేర్కొన్నాడు.
జూన్ 13 నుంచి జులై 5వరకు బాల్కన్స్లో తన ఫౌండేషన్ ఆధ్వర్యంలో 'ఆడ్రియా టూర్'' నిర్వహిస్తున్నట్లు జకోవిచ్ తెలిపాడు. ''ఆడ్రియా టోర్నీ నిర్వహించడం నాకు సంతోషంగా ఉంది. టోర్నీని ప్రభుత్వ నిబంధనలకు లోబడే నిర్వహించేలా ప్లాన్ చేసాం. ఈ టోర్నీలో నాతో పాటు మరో ముగ్గురు టాప్ ఆటగాళ్లు ఆడతారు. డొమినిక్ థీమ్, గ్రిగొర్ డిమిత్రోవ్, అలెగ్జాండర్ జ్వరెవ్ ఆడ్రియా టోర్నీలో పాల్గొంటారు' అని టెన్నిస్ దిగ్గజం స్పష్టం చేశాడు.
ఆడ్రియా టూర్కు రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్ను ఆహ్వానిస్తున్నారా అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించగా... 'ఫెదరర్ మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. అందుకే అతడిని పిలవానుకోవట్లేదు. నాదల్ను ఆహ్వానించడంలో నాకెలాంటి ఇబ్బందీ లేదు. అయితే పిలిచినా.. అతనొస్తాడని మాత్రం అనుకోవట్లేదు' అని జకోవిచ్ పేర్కొన్నాడు. కరోనా వైరస్ విజృంభణ కారణంగా ఫిబ్రవరి నుంచి ఎలాంటి టెన్నిస్ పోటీలు జరగడంలేదు. అంతకుముందే జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచాడు.
ప్రపంచ టెన్నిస్ నంబర్వన్ నోవాక్ జొకోవిచ్ కరోనా పోరుపై ఇప్పటికే తన సహృదయతను చాటుకున్నాడు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న మహమ్మారి కరోనా వైరస్పై పోరాడేందుకు తన వంతు సాయం ప్రకటించాడు. జొకోవిచ్ 1.1 మిలియన్ డాలర్ల (రూ.8.28 కోట్లు) భారీ విరాళాన్ని ప్రకటించాడు. ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య పరికరాలు, శానిటరీ వస్తువులను కొనుగోలు చేయడానికి ఇంత మొత్తాన్ని సెర్బియా ప్రభుత్వానికి విరాళం ఇచ్చినట్టు జొకో తెలిపాడు.