హైదరాబాద్: భారీ వర్షాలతో ముంబై నగర జీవనం అస్తవ్యస్తం అయింది. సోమవారం రాత్రి నుంచి ప్రారంభమైన భారీ వర్షాలు ముంబై నగరంతో పాటు పొరుగునే ఉన్న నవీ ముంబై, థానే ప్రాంతాలను ముంచెత్తాయి. మంగళవారం రోజంతా వర్షం పడుతూనే ఉండటంతో నగరంలోని ప్రధాన రహదారులతో పాటు ఈస్ట్రన్, వెస్ట్రన్ ఎక్స్ప్రెస్ హైవేలు, సియాన్-పన్వెల్ రహదారి, ఎల్బీఎస్ మార్గ్లలో ట్రాఫిక్ స్తంభించింది.
నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి రహదారులపై పడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ముంబై వరదలు సాధారణ ప్రజలతో పాటు ప్రముఖుల జీవితాలను కూడా ప్రభావితం చేశాయి. ఈ క్రమంలో టెన్నిస్ స్టార్ మహేశ్భూపతి తన భార్య లారా దత్తాపై కోపడ్డారు.

అసలేం జరిగింది?
ముంబైలో కురిసిన భారీ వర్షాలకు ఇంట్లోకి వరద నీరు రావడంతో వాడిని అడ్డుకునేందుకు లారా దత్తా ఓ చిత్రమైన పని చేసింది. వింబుల్డన్, యుఎస్ ఓపెన్, ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్ ఓపెన్లలో వాడిన తుండు గుడ్డలు (టవల్స్)ను మహేశ్ భూపతి మధుర స్మృతులుగా వాటిని దాచుకున్నాడు.
అయితే భారీ వర్షాలకు ఇంట్లోకి వరద నీరు రావడంతో.... ఆ నీటిని అడ్డుకోవడానికి మహేశ్ ఎంతో అపురూపంగా దాచుకున్న ఆ టవల్స్ను అడ్డంగా పెట్టింది. ఆ ఫోటోను లారా దత్ తన ట్వట్టర్లో పోస్టు చేసింది. అంతేకాదు వింబుల్డన్, యుఎస్ ఓపెన్, ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్ ఓపెన్ తువ్వాళ్లు ఇలా ఉపయోగపడ్డాయంటూ పోస్టు చేసింది.
అంతేకాదు వర్షంలో చిక్కుకున్న అందరూ సురక్షితంగా ఇంటికి చేరాలని ఆకాంక్షించింది. అయితే భార్య చేసిన పనిపై మహేష్ భూపతి మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశాడు. 'నువ్వేమైనా నన్ను ఆట పట్టిస్తున్నావా!! వేళాకోళంగా ఉందా? అవి కొన్నేళ్ల నా శ్రమకు ప్రతిఫలం అంటూ ట్విటర్లోనే భూపతి బదులిచ్చాడు.
మరోవైపు ముంబై, థానే, పల్ఘర్, రాయఘడ్లతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాతాంల్లో గత నాలుగురోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం, అధికారులు అప్రమత్తమయ్యారు. పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు.
ఎవరైనా ఆపదలో చిక్కుకుంటే సాయమందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ముంబై పోలీసులు ప్రకటించారు. 100కు డయల్ చేయాలని ముంబై ప్రజలకు సూచించారు.