బ్రిస్బేన్: నాలో టెన్నిస్ ఆడే సత్తా ఉంది. ఇంకా ఫైర్ అలానే ఉంది. ఇప్పటికీ కూడా ఎవరికైనా మేటి ప్రత్యర్థినే అని రష్యా అందం మరియా షరపోవా అంటోంది. ఈనెల 6 నుంచి ప్రారంభం కానున్న బ్రిస్బేన్ ఈవెంట్లో మాజీ ప్రపంచ నంబర్వన్ షరపోవాకు వైల్డ్కార్డ్ ఎంట్రీ దక్కింది. దీంతో షరపోవా మళ్లీ రాకెట్ పట్టనుంది. ప్రతిఏటా ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీకి ముందు సన్నాహక టోర్నీగా బ్రిస్బేన్ ఈవెంట్ జరుగుతుంది.
బంగ్లాతో టీ20 సిరీస్.. పాక్ జట్టులోకి సర్ఫరాజ్ రీఎంట్రీ?!!
మంగళవారం మరియా షరపోవా మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ' బ్రిస్బేన్ ఈవెంట్లో పాల్గొంటున్నా. చాలా రోజుల తర్వాత రాకెట్ పడుతున్నా. కెరీర్ తొలినాళ్లలో 30 ఏళ్లు దాటాక కూడా ఆడతానని ఎప్పుడు అనుకోలేదు. నాలో ఆట మిగిలుంది. నాలో ఇంకా ఫైర్ అలానే ఉంది. నేనిక్కడ ఎవరికైనా మేటి ప్రత్యర్థినే' అని 32 ఏళ్ల షరపోవా పేర్కొంది. గత సీజన్ క్లిష్టంగా గడిచిన తనకు ఇది తాజా ఆరంభమని చెప్పుకొచ్చింది.
'నా భుజం గాయం తిరగబెట్టనంతవరకు, అలానే నా శరీరం ఆటకు సహకరించేవరకు టెన్నిస్ ఆడుతూనే ఉంటా. నాకు ఇంకా చాలా సమయం ఉంది. చాలా సవాళ్లు ఉంటాయి. అన్నిటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా. ఈ సీజన్ మొత్తం రాణించగలనే నమ్మకం ఉంది' అని షరపోవా చెప్పుకొచ్చింది. షరపోవా 2015లో బ్రిస్బేన్ టైటిల్ను గెలుచుకుంది.
గత ఆగస్టులో జరిగిన యూఎస్ ఓపెన్లో అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ చేతిలో తొలి రౌండ్లో ఓడిపోయాక షరపోవా మళ్లీ బరిలోకి దిగలేదు. భుజం గాయం కారణంగా 2019 సీజన్ మొత్తంకు దూరమయింది. దీంతో డబ్ల్యూటీఏ ర్యాంకుల్లో షరపోవా 133వ ర్యాంకుకు పడిపోయింది. బ్రిస్బేన్ ఈవెంట్లో ఆమెతో పాటు నయోమి ఒసాకా, యాష్లే బార్టీ, ప్లిస్కోవా, ఎలీనా స్వితొలినా, క్విటోవా, కికి బెర్టెన్స్ తదితర స్టార్ క్రీడాకారిణులు పాల్గొంటున్నారు.