ముంబై: మహేష్ భూపతి, లియాండర్ పేస్... ఒకానొక సమయంలో భారత్ టెన్నిస్కు దిక్సూచి లాగా నిలిచారు. అయితే ఏమైందో ఏమో గానీ వీరిద్దరికీ కోర్టులోనూ, బయటా అస్సలు పడదు. శనివారం ముంబైలో ఓ ఇంటర్యూలో ఒకప్పటి తన టెన్నిస్ భాగస్వామి మహేశ్ భూపతిపై లియాండర్ పేస్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
విభేదాలతో విడిపోయిన చాలాకాలం తర్వాత తమ ఇద్దరిలో ఎవరిది తప్పో.. ఎవరిది ఒప్పో చెప్పలేమని అన్నాడు. తామిద్దరం పూర్తిగా వేర్వేరు రకాల వ్యక్తులమని, ఇద్దరి వ్యక్తిత్వాల్లో ఎంతో వ్యత్యాసం ఉందని పేస్ పేర్కొన్నాడు.
'మహేశ్(భూపతి), నేను పూర్తిగా వేర్వేరు రకాల వ్యక్తులం. వేర్వేరు ధోరణిలో పని చేస్తాం. వేర్వేరు రకాల్లో నడచుకుంటాం. మా స్నేహాన్ని కూడా అలాగే నిర్వహించాం. ఎవరికి నచ్చినట్టు వారు పని చేస్తుంటాం. మా ఇద్దరిలో తప్పెవరిదో.. ఒప్పెవరిదో చెప్పను. ఎందుకంటే మా ఇద్దరిలో తప్పొప్పులు ఎవరిదైనా కావొచ్చని' పేస్ అన్నాడు.
అంతేకాదు తమ ఇద్దరికీ సొంత స్టయిలంటూ ఒకటుందని, వ్యక్తిగతంగా మేం సాధించిన దానిపట్ల ఒకరిని ఒకరు గౌరవించుకొంటామని పేర్కొన్నాడు. భూపతితో కలిసి సాధించిన విజయాల పట్ల తనకు అత్యంత గౌరవం ఉందని చెప్పాడు. పేస్ 1999లో భూపతితో కలిసి పురుషుల డబుల్స్ ట్రోఫీ టైటిల్ నెగ్గిన నాటి జ్ఞాపకాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు.
తామిద్దరం కలిసి గొప్ప గొప్ప ఘనతలు సాధిస్తానని జూనియర్స్ దశలో ఆడుతునప్పుడే 1990లో భూపతితో చెప్పినట్లు వెల్లడించాడు. 'మనమిద్దరం టెన్నిస్ ప్రపంచాన్ని జయించగలం అని 1990లో జూనియర్ వింబుల్డన్ సమయంలో భూపతితో చెప్పా. దానికతను నవ్వుకున్నాడు. అప్పుడు భూపతి కనీసం మెయిన్ డ్రాలో కూడా లేడు. ఇక, వింబుల్డన్ ఫైనల్లో మ్యాచ్ పాయింట్ నెగ్గిన అనంతరం అతని ముఖానికేసి చూశాను. మా ఇద్దరి ముఖాల్లో వ్యత్యాసం కనిపించింది. ఇదంతా జీవితంలో సాగే ప్రయాణంలో భాగమని.. ఇది కేవలం ఒక విజయం మాత్రమేనని నేననుకున్నాను. ఇక సాధించిన విజయం పట్ల నమ్మశక్యం కాని రీతిలో ఆశ్చర్యంతో మహేష్ కనిపించాడు' అని పేస్ అన్నాడు.