భారత్కు పెద్ద ఊరట: పాక్ నుంచి తటస్థ వేదికకు డేవిస్ కప్ పోరు

హైదరాబాద్: పాక్లో డేవిస్ కప్ మ్యాచ్ ఆడేందుకు ససేమిరా అంటోన్న భారత టెన్నిస్ సమాఖ్యకు పెద్ద ఊరట లభించింది. భారత్-పాక్ జట్ల మధ్య జరగాల్సిన డేవిస్ కప్ పోరుని తటస్థ వేదికకు మారుస్తున్నట్టు అంతర్జాతీయ టెన్నిస్ సంఘం (ఐటీఎఫ్) సోమవారం అధికారిక ప్రకటన చేసింది.
వివరాల్లోకి వెళితే..
ఆసియా ఓసియానియా గ్రూప్-1 డేవిస్ కప్ పోరులో భాగంగా భారత్-పాక్ జట్ల మధ్య షెడ్యూల్ ప్రకారం గత నెలలోనే మ్యాచ్లు జరగాలి. అయితే, ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య పాక్కు వెళ్లి మ్యాచ్లు ఆడేందుకు భారత టెన్నిస్ సమాఖ్య(ఐటా) విముఖత వ్యక్తం చేసింది.
దీంతో ఈ మ్యాచ్లను నవంబర్ 29, 30వ తేదీలకు వాయిదా వేసిన ఐటీఎఫ్.. తటస్థ వేదికలో మ్యాచ్లు నిర్వహించాలని పాక్ టెన్నిస్ సమాఖ్య(పీటీఎఫ్)ను ఆదేశించింది. ప్రస్తుత పరిస్థితుల్లో పాక్లో పోరు నిర్వహణ కష్టమని, భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయని ఐటీఎఫ్ స్వతంత్ర భద్రతా సలహాదారులు నివేదిక ఇచ్చారు.
భద్రత సలహాదారుల సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. నిబంధనల ప్రకారం ఆతిథ్య దేశం నుంచి ఈవెంట్ను తరలిస్తే తటస్థ వేదికను ఎంపిక చేసే హక్కు ఆ దేశానికే కల్పిస్తారు. తటస్థ వేదిక ఎక్కడన్నది త్వరలోనే తేలనుంది. పాకిస్థాన్తో తలపడే భారత డేవిస్కప్ జట్టుకు మాజీ ఆటగాడు, జాతీయ టెన్నిస్ సమాఖ్య సెలక్షన్ ప్యానెల్ ఛైర్మన్ రోహిత్ రాజ్పాల్ నాన్ప్లేయింగ్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.
భూపతి స్థానంలో అతడు నియమితుడయ్యాడు. పాక్తో పోరుకు మాత్రమే నాన్ ప్లేయింగ్ కెప్టెన్గా రోహిత్ రాజ్పాల్ వ్యవహరిస్తాడని అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) ప్రకటించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications