హైదరాబాద్: తన సుదీర్ఘ కెరీర్లో ఎంతో సాధించానని, ఇక కొత్తగా నిరూపించుకునేదేమీ లేదని భారత టెన్నిస్ గ్రేట్ లియాండర్ పేస్ అన్నాడు. ఈ ఏడాది డేవిస్ కప్ జట్టు నుంచి లియాండర్ పేసర్ని నాన్ ప్లేయింగ్ కెప్టెన్ మహేశ్ భూపతి తప్పించిన సంగతి తెలిసిందే.
అయితే తాను టెన్నిస్ ప్రేమించే సత్తా ఉన్నంత కాలం ఆడతానని, ఇప్పట్లో రిటైర్మెంట్ ఆలోచనే లేదని తేల్చి చెప్పాడు. 'నేను ఎవరిముందు కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏం లేదు. నేనేంటో నా కెరీరే సమాధానమిస్తుంది. ఈ వయసు లోనూ టెన్నిస్ ఆడుతున్నానంటే దానికి కారణం, నేను టెన్నిస్ను అమితంగా ప్రేమించడమే' అని పేస్ అన్నాడు.
'దేశం తరఫున ఎన్నో విజయాలు సాధించాను. దేశం తరుపున ఆడటాన్ని ఎప్పుడూ ఆస్వాదించా. గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో ఆడేది వ్యక్తిగతమైనా బరిలోకి దిగేది మాత్రం మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించేందుకే' అని పేస్ భావోద్వేగంతో తెలిపాడు.
44 ఏళ్ల పేస్ తాను వచ్చే ఏడాది మరిన్ని టైటిల్స్ గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పుకొచ్చాడు. 2018లో కొత్త మిక్స్డ్ డబుల్స్ భాగస్వామితో బరిలోకి దిగుతానని, మళ్లీ విజయాలు సాధిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. పేస్ తన కెరీర్లో మొత్తం 18 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలిచాడు.
అందులో ఎనిమిది డబుల్స్ విభాగంలో కాగా, 10 మిక్స్డ్ డబుల్స్ విభాగంలో గెలవడం విశేషం. ప్రస్తుతం టెన్నిస్ ర్యాంకింగ్స్లో 62వ స్ధానంలో కొనసాగుతున్నాడు. మహేశ్ భూపతి ఓ యువకుడిగా ఉన్నప్పుడు అతడిని ఎంపిక చేశానని ఇప్పుడు మేం వరల్డ్ ఛాంపియన్స్ అయ్యామని తెలిపాడు.