హైదరాబాద్: తల్లిగా బిడ్డకు జన్మనివ్వడమంటే చచ్చి బతకడమే. అలాగే బిడ్డకు జన్మనిచ్చి చచ్చిబతికింది సెరెనా విలియమ్స్. ఈ విషయాన్ని తన భర్త చేసుకుంటూ.. తాజాగా వింబుల్డన్ టోర్నీలో సెరెనా రన్నరప్గా మిగలిందని.. ఈ సారి కచ్చితంగా టైటిల్ గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. గతేడాది తన బిడ్డకు జన్మనిచ్చిన సమయంలో సెరెనా విలియమ్స్ చనిపోతుందేమోనని భయపడ్డానని ఆమె భర్త, రెడిట్ స్థాపకుడు అలెక్సిస్ ఒహానియన్ తెలిపారు.
తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొని 36 ఏళ్ల వయసులోనూ ధాటిగా ఆడుతూ ఆమె వింబుల్డన్ రన్నరప్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆమెను ఓడించిన ఏంజెలిక్ కెర్బర్కు ఒహానియన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెరెనాను ప్రత్యేకంగా ప్రశంసించాడు. 'నా బిడ్డకు జన్మనిచ్చిన కొన్ని రోజుల తర్వాత, శస్త్రచికిత్స చేయించుకునేందుకు వెళ్తున్న నా సతీమణి సెరెనాకు ముద్దిచ్చి గుడ్బై చెప్పాను. అప్పుడామె ప్రాణాలతో తిరిగొస్తుందో లేదో మాకెవరికీ తెలియదు. ఆమె బతకాలని కోరుకున్నాం. ఆ తర్వాత 10 నెలలకే ఆమె వింబుల్డన్ ఫైనల్ చేరింది' అని ఒహానియన్ ట్వీట్ చేశాడు.
రక్తం గడ్డకట్టకుండా గతేడాది సెప్టెంబర్లో సెరెనా శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. 'ఏంజెలిక్ కెర్బర్కు అభినందనలు. సెరెనా విలియమ్స్ త్వరలోనే ట్రోఫీ అందుకుంటుంది. ఒక గొప్ప ఘనతను మళ్లీ ఆమె ఇంటికి తిరిగి తీసుకురావాలని కోరుకుంటోంది. ఆమె మరెన్నో ట్రోఫీలు గెలవగలదని మా కుటుంబానికి తెలుసు. ఆమె ఇప్పుడే ప్రయాణం మొదలు పెట్టింది' అని ఒహానియన్ ట్వీట్ చేశాడు.
అమెరికా టెన్నిస్ గ్రేట్ సెరెనా విలియమ్స్ వింబుల్డన్ టైటిల్ ఆశలకు అంజెలిక్ కెర్బర్ గండికొట్టింది. కెర్బర్ విజృంభించిన వేళ వింబుల్డన్లో ఈ మాజీ ఛాంపియన్కు చుక్కెదురైంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో పదకొండో సీడ్ కెర్బర్ 6-3, 6-3తో వరుస సెట్లలో సెరెనా విలియమ్స్ను ఓడించింది. స్టెఫీగ్రాఫ్(1996) తర్వాత వింబుల్డన్ టైటిల్ గెలిచిన తొలి జర్మన్గా కెర్బర్ నిలిచింది. మరోవైపు పదోసారి ఫైనల్ చేరిన సెరెనా.. వరుస సెట్లలో ఓటమిపాలై మార్గరెట్ కోర్టు(24) గ్రాండ్స్లామ్ రికార్డుకు అడుగుదూరంలో నిలిచిపోయింది.