మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ 2021లో బుధవారం సంచలన ప్రదర్శనలు నమోదయ్యాయి. పురుషుల సింగిల్స్లో అత్యధిక గ్రాండ్స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఏకై క ప్లేయర్గా రికార్డు నెలకొల్పాలనుకున్న స్పెయిన్ బుల్, రెండో సీడ్ రాఫెల్ నాదల్ కల చెదిరింది. మహిళల సింగిల్స్లోనూ టాప్ సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా)కి చుక్కెదురైంది. నాదల్, బార్టీ ఇద్దరూ క్వార్టర్ ఫైనల్స్లోనే ఓడిపోయి ఇంటి దారి పట్టారు. రుబ్లేవ్పై గెలిచి మద్వెదెవ్ సెమీస్ చేరాడు.
బుధవారం హోరాహోరీగా, ఉత్కంఠభరితంగా సాగిన ఐదు సెట్ల మ్యాచ్లో అయిదో సీడ్ స్పెఫనోస్ సిట్సిపాస్ 3-6, 2-6, 7-6 (7-4), 6-4, 7-5తో నాదల్పై చిరస్మరణీయ విజయం సాధించాడు. 22 ఏళ్ల సిట్సిపాస్ తొలి రెండు సెట్లు చేజారినా.. అద్భుతంగా పోరాడాడు. కెరీర్లో గ్రాండ్స్లామ్ టోర్నీల్లో 225 సార్లు తొలి రెండు సెట్లు గెలుచుకున్న నాదల్.. ఓటమి చవిచూడడం ఇది రెండోసారి మాత్రమే. ఆరంభంలో ఆధిపత్యాన్ని ప్రదర్శించిన నాదల్.. అలవోకగానే తొలి రెండు సెట్టు చేజిక్కించుకున్నాడు. మూడో సెట్ నుంచి అతడి తడబాటు మొదలైంది.
పుంజుకున్న సిట్సిపాస్ సెట్ను టై బ్రేక్కు తీసుకెళ్లి పైచేయి సాధించాడు. నాలుగో సెట్లో ఇద్దరూ ఓ దశలో 4-4తో సమంగా నిలిచారు. కానీ తొమ్మిదో గేమ్లో బ్రేక్ సాధించిన సిట్సిపాస్.. ఆ తర్వాత సర్వీసు నిలబెట్టుకుని సెట్ను చేజిక్కించుకున్నాడు. నిర్ణయాత్మక ఇదో సెట్ కూడా దాదాపు అలాగే సాగింది. ఇద్దరూ 5-5తో సమంగా నిలిచారు. కానీ 11వ గేమ్లో సిట్సిపాస్ నాదల్ సర్వీసును బ్రేక్ చేసి 6-5తో ఆధిక్యంలోకి వెళ్లాడు. తర్వాతి గేమ్ హోరాహోరీగా సాగింది. నాదల్ రెండు మ్యాచ్ పాయింట్లను కాచుకున్నా.. సిట్సిపాస్ చివరికి ఓ చక్కని బ్యాక్హ్యాండ్ షాట్తో మ్యాచ్ను ముగించాడు. సిట్సిపాస్ సెమీఫైనల్లో యుఎస్ ఓపెన్ రన్నరప్ మెద్వెదెవ్ను ఢీకొంటాడు.
మరో క్వార్టర్స్లో నాలుగో ర్యాంకర్ డానిల్ మద్వెదెవ్ 7-5, 6-3, 6-2 తేడాతో తన దేశానికి చెందిన ఆరో సీడ్ అండ్రీ రుబ్లేవ్పై అలవోకగా గెలిచాడు. సెమీస్లో శుక్రవారం సిట్సిపాస్, మద్వెదెవ్ తలపడనున్నారు. టాప్ సీడ్ జొకోవిచ్, తొలిగ్రాండ్స్లామ్లోసెమీస్ చేరిన అస్లాన్ కరత్సెవ్ మధ్య గురువారం మ్యాచ్ జరుగనుంది.
ప్రపంచ నంబర్వన్ ర్యాంకర్ ఆష్లే బార్టీకి ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఊహించని పరాజయం ఎదురైంది. 1978 (క్రిస్ ఓనీల్) తర్వాత.. సొంతగడ్డపై గ్రాండ్స్లామ్ టైటిల్ను సాధించిన తొలి ఆస్ట్రేలియా ప్లేయర్గా నిలువాలనుకున్న ఆమె ఆశ తీరలేదు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో బార్టీ 6-1, 3-6, 2-6 తేడాతో 25వ ర్యాంకర్ కరోలినా ముచోవా (చెక్ రిపబ్లిక్) చేతిలో పరాజయం పాలైంది. గ్రాండ్స్లామ్ టోర్నీలో సెమీస్ చేరడం ముచోవాకు ఇదే తొలిసారి. మరో క్వార్టర్స్ మ్యాచ్లో 22వ సీడ్ జెన్నిఫర్ బ్రాడీ 4-6, 6-2, 6-1 తేడాతో అన్సీడెడ్ జెసికా పెగులపై విజయం సాధించింది. సెమీస్లో ముచోవాతో బ్రాడీ తలపడనుంది.