మెల్బోర్న్: సీజన్ తొలి గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఇండియా లెజెండ్ సానియా మీర్జా కథ ముగిసింది. అమెరికా టెన్నీస్ ప్లేయర్ రాజీవ్ రామ్తో కలిసి మిక్స్డ్ డబుల్స్లో బరిలోకి దిగిన హైదరాబాద్ స్టార్.. క్వార్టర్ ఫైనల్కే పరిమితమైంది. మంగళవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ఫైనల్లో అన్సీడెడ్ సానియా-రామ్ 4-6, 6-7 తేడాతో జాసోన్ కుబ్లర్, జమీ ఫోర్లిస్ ఆస్ట్రేలియా మిక్స్డ్ ద్వయం చేతిలో ఓటమిపాలైంది. తొలి సెట్లో దారుణంగా విఫలమైన సానియా జోడీ.. రెండో సెట్లో పుంజుకున్నా పై చేయి సాధించలేకపోయింది.
ఆదివారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్లోసానియా-రాజీవ్ ద్వయం 7-6 (8/6), 6-4తో ఎలెన్ పెరెజ్-మిడిల్కూప్ (నెదర్లాండ్స్) జోడీపై గెలిచింది. 87 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సానియా-రాజీవ్ రామ్ ద్వయం ఐదు ఏస్లు సంధించి తమ ప్రత్యర్థి జోడీ సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది.
డబుల్స్లో ఉక్రెయిన్ ప్లేయర్ నదియా కిచ్నోక్తో జోడీ కట్టిన సానియా తొలి రౌండ్లోనే ఓటమిపాలైంది. స్లోవేనియాకు చెందిన తమరా జిదాన్సెక్-కాజా జువాన్ జోడీ 4-6, 6-7(5) చేతిలో సానియా ద్వయం ఓటమిపాలైంది. ఈ ఓటమి అనంతరం తనకు ఇదే చివరి సీజన్ అని, అనంతరం ఆటకు వీడ్కోలు పలుకుతానని ఈ హైదరాబాద్ స్టార్ ప్రకటించింది.
ఈ ఓటమి తర్వాతే సానియా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించింది. 'ఇదే నా చివరి సీజన్ అని నిర్ణయించుకున్నాను. నేను ఒక వారం నుంచి ఈ టోర్నీలో ఆడుతున్నా. ఈ సీజన్ మొత్తం ఆడగలనో లేదో తెలియదు. కానీ నేను మొత్తం సీజన్లో ఉండాలనుకుంటున్నాను" అని సానియా తెలిపింది. దాంతో తన కెరీర్లో చివరి ఆస్ట్రేలియా ఓపెన్ ఆడిన సానియా.. నిరాశగా వెనుదిరిగినట్లు అయింది.